ఆ కంపెనీల దివాలా ప్రక్రియ ప్రారంభించండి | Start the bankruptcy process of those companies | Sakshi
Sakshi News home page

ఆ కంపెనీల దివాలా ప్రక్రియ ప్రారంభించండి

Nov 4 2018 2:32 AM | Updated on Nov 4 2018 2:32 AM

Start the bankruptcy process of those companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకులకు రుణాలు ఎగవేసిన ల్యాంకో గ్రూపు కంపెనీల్లో తాజాగా మరో రెండు కంపెనీలు కూడా చేరాయి. ఆంధ్రా బ్యాంక్‌కు ల్యాంకో థర్మల్‌ పవర్‌ లిమిటెడ్, ల్యాంకో సోలార్‌ ఎనర్జీ లిమిటెడ్‌లు వరుసగా రూ. 129.99 కోట్లు, రూ. 150.57 కోట్ల మేర బకాయి పడ్డాయి. తీసుకున్న ఈ రుణాలను తిరిగి చెల్లించడంలో ఆ కంపెనీలు విఫలమయ్యాయని, అందువల్ల ఆ కంపెనీల దివా లా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ముందు ఆంధ్రా బ్యాంక్‌ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ల్యాంకో థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌పై దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్‌ సభ్యులు (జ్యుడీషియల్‌) రాతకొండ మురళీ విచారణ జరిపారు. ఇరు ఇరు వర్గాల వాదనలు విన్న మురళీ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.  

ల్యాంకో సోలార్‌కు నోటీసులు..  
ల్యాంకో సోలార్‌ ఎనర్జీపై దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్‌ మరో సభ్యులు అనంత పద్మనాభస్వామి (జ్యుడీషియల్‌) విచారణ జరిపారు. ఈ పిటిషన్‌లో కూడా ఆంధ్రా బ్యాంకు తరఫున లక్ష్మీనర్సింహ వాదనలు వినిపించారు. తమ బ్యాంకుకు ల్యాంకో సోలార్‌ రూ. 150.57 కోట్ల మేర బకాయి పడిందని చెప్పారు. ఈ కంపెనీ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సైతం రుణం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ట్రిబ్యునల్‌ సభ్యులు ల్యాంకో సోలార్‌కు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 14కి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement