పవర్‌ ‘ఫుల్‌’ | Singareni Power Station Achieves 95 Percentage PLF In February Month | Sakshi
Sakshi News home page

పవర్‌ ‘ఫుల్‌’

Mar 3 2020 2:02 AM | Updated on Mar 3 2020 2:02 AM

Singareni Power Station Achieves 95 Percentage PLF In February Month - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నిర్వహిస్తున్న 1,200 (2 గీ600) మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వి ద్యుత్‌ కేంద్రానికి సంబంధించిన 600 మెగావాట్ల రెండు యూనిట్లు గత ఫిబ్రవరిలో 100.18 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) సాధించాయి. విద్యుత్‌ కేంద్రం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే ఓ నిర్దిష్ట కాలంలో జరిగిన వాస్తవ విద్యుదుత్పత్తిని సాంకేతిక పరిభాషలో పీఎల్‌ఎఫ్‌ అంటారు.

ఫిబ్రవరిలో సింగరేణి విద్యుత్‌ కేంద్రం 836.70 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయగా, అందులో ప్లాంట్‌ నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ పోను మిగిలిన 791.79 మిలియన్‌ యూ నిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌ ద్వారా రాష్ట్రానికి సరఫరా అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్లాంట్‌ ఇప్పటివరకూ 8,398 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా 7,895 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేసింది. కాగా, ఈ ఘనతపై సంస్థ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో ఐదో స్థానం: సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం గత రెండేళ్లలో మూడుసార్లు 100 శా తం పీఎల్‌ఎఫ్‌ సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2017–18లో జాతీయ స్థాయిలో అత్యధిక పీఎల్‌ఎఫ్‌ కలిగిన అత్యుత్తమ 25 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఐదో స్థానాన్ని సాధించింది.

విడివిడిగా 15 సార్లు..: సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని చెరో 600 మెగావాట్ల రెండు యూనిట్లు విడివిడిగా 15 సార్లు 100 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించాయి. 2వ యూనిట్‌ 9 సార్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. 2017లో ఫిబ్రవరి, మే, నవంబర్, 2018లో జూలై, సెప్టెంబర్‌ అక్టోబర్, 2019లో జనవరి, ఫిబ్రవరి, 2020లో ఫిబ్రవరిలో రెండో యూనిట్‌ 100 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement