ఓట్లు వేయలేదని.. ప్రతీకారం | Sarpanch Contestant Refuses To Give Land For Road In Warangal | Sakshi
Sakshi News home page

ఓట్లు వేయలేదని.. ప్రతీకారం

Feb 3 2019 1:44 PM | Updated on Feb 3 2019 1:44 PM

Sarpanch Contestant Refuses To Give Land For Road In Warangal - Sakshi

గుర్రప్పతండి శివారులో డొంకదారికి అడ్డంగా ఏర్పాటు చేసిన కంచె

సాక్షి, మరిపెడ రూరల్‌: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని ఆరోపిస్తూ ఓ రైతు వ్యవసాయ పొలాలకు వెళ్లే డొంకదారిని జేసీబీతో తవ్వేసి దారికి అడ్డంగా కంచె ఏర్పాటు చేసిన ఘటన మండలంలోని ఎడ్జెర్ల శివారు గుర్పప్పలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..తండా నుంచి సుమారు 100 మంది రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిలేక ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో 12 సంవంత్సరాల క్రితం తండాలో పెద్దమనుషులు అందరూ మాట్లాడుకుని తల కొంత భూమి ఇస్తామని ముందుకు వచ్చి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న మన్నెగూడెం గ్రామం వరకు వెళ్లే విధంగా డొంకదారిని ఏర్పాటు చేసుకున్నారు.
జేసీబీతో చదును చేసిన డొంకదారి 

ఈ రహదారిపై ఉన్న గుంతలను సైతం గ్రామ పంచాయతీ నిధులతో మట్టి పోయించి చదును చేసుకున్నారు. మరో సారి ఉపాధి హామీ పథకం ద్వారా మరోమారు గుంతలను పూడ్చుకున్నారు.  పస్తుతం పీఆర్‌డబ్ల్యూ కింద తారురోడ్డు కూడా మంజూరు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన బానోతు రామన్న ఓటమి పాలయ్యాడు. ఇది దృష్టిలో పెట్టుకొని డొంక దారి మధ్యలో రామన్న భూమిలో నుంచి ఉన్న దారిని జేసీబీ ద్వారా తవ్వి చదును చేయించాడు. దారికి అడ్డంగా కంచెను కూడా ఏర్పాటు చేశారు. ఈ రహదారి గుండా పొలాలు వెళ్లే రైతులు బతిలాడినప్పటికీ దారి ఇవ్వనని తెగేసి చెప్పడంతో తండాలో  గొడవ తారస్థాయికి చేరింది. దీనిపై రామన్నను వివరణ కోరగా ఈ భూమి తమ సొంతమని కోర్టు నుంచి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నాని తెలిపారు. అందుకు అనుగుణంగా చదును చేసుకున్నట్లు తెలిపారు. కోర్డు ద్వారా తెచ్చుకున్న స్టేను విలేకరులకు చూపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement