భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో
భర్త గుండె పోటుతో మృతి
సంగారెడ్డి అర్బన్: ఆర్టీసీలో పనిచేస్తున్న భార్య ఉద్యోగం పోతుందన్న బెంగతో మనస్తాపానికి గురైన భర్త గుండె పోటుతో మృతిచెందిన ఘటన బాబానగర్లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కర్నె కిశోర్ (39) ఓ ప్రైవేట్ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. భార్య నాగరాణి ఆర్టీసీలో పని చేస్తుంది. గత ఐదు రోజులుగా ఆర్టీసీలో సమ్మె జరుగుతుండటం.. ప్రభుత్వం కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రకటించడంతో పరిస్థితి ఎలా అని ఇంట్లో చర్చించుకున్నారు. ఈ క్రమంలో భార్య ఉద్యోగం పోతే బతకడం కష్టమవుతుందని భర్త మనస్తాపానికి గురైయ్యాడు. రెండ్రోజులుగా సరిగ్గా భోజనం కూడా చేయకపోవడంతో అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో నిద్రలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య నాగరాణితోపాటు రెండేళ్ల పాప ఉంది. తన భర్త మృతికి సీఎం కేసీఆర్ వ్యాఖ్యాలే కారణమని నాగరాణి ఆరోపించారు.