జిల్లా ఓటర్లు 27,12,831
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఓటర్ల జాబితాకు అడ్డంకులు తొలగిపోవడంతో శనివారం జిల్లా యంత్రాంగం కొత్త జాబితానుప్రకటించింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని, పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొన్ని పార్టీలు ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఓటర్ల జాబితా విడుదలలోఆలస్యమైంది. కాగా, ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులతో పాటు కొత్తగా నమోదుకు అవకాశం కల్పించడంతో జిల్లా వ్యాప్తంగా 1,83,873 మంది ఓటర్లుగా నమోదయ్యారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 27,12,831కి చేరింది. ఇందులో మహిళలు 12,94,102 కాగా, పురుషులు 14,18,328 ఉన్నారు.
మహిళలు అధికం
గత నెల 25వ తేదీ వరకు ఓటర్ల జాబితా ముసాయిదా సవరణకు అవకాశం కల్పించడంతో మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొత్తగా 94,025 మంది స్త్రీలు ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకున్నారు. మహిళలతో పోలిస్తే పురుషులు కేవలం 89,799 మంది మాత్రమే ఓటర్లుగా చేరారు. తాజాగా థర్డ్ జెండర్ కేటగిరీలో 49 మంది ఓటర్లు జాబితాలోకెక్కారు. దీంతో వీరి సంఖ్య 401 చేరింది.