
యథేచ్ఛగా గంధం చెక్కల స్మగ్లింగ్
అక్రమార్కులు యథేచ్ఛగా గంధపు చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులకు టోకరా వేసి తమపని కానిస్తున్నారు.
రైతులకు టోకరా పెట్టి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
చిగురాల్పల్లి పరిసరాల్లో చెట్లు నరికివేత..
పరిగి : అక్రమార్కులు యథేచ్ఛగా గంధపు చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులకు టోకరా వేసి తమపని కానిస్తున్నారు. పరి గి మండల పరిధిలోని చిగురాల్పల్లి పరిసరా లు గంధపు చెక్కల స్మగ్లింగ్కు అడ్డాగా మారుతోంది. అక్రమార్కులు రైతులకు రూ. 1000, 2000 చేతిలో పెట్టి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు చెట్లు విక్రయించేం దుకు అంగీకరిస్తే పగలే నరుకుతారు.. లేదంటే రాత్రికి రాత్రే చెట్లను మాయం చేస్తారు. ఇదే తరహాలో గురువారం కొందరు గంధపు చెక్కల వ్యాపారులు చిగురాల్పల్లి పొలాల్లో గంధపు చెట్లను నరుకుతూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు.
దందా ఇలా నడిపిస్తారు...
స్మగ్లర్లు ముందు గంధపు చెట్లు లభించే ప్రాంతాలను ఎంచుకుంటారు. ఎవరూ లేనప్పుడు ఒంటరిగా వెళ్లి చెట్టుకు హ్యాండ్ డ్రిల్లర్తో రంధ్రం చేస్తుంటారు. చెట్టులో గంధం ఏమేరకు తయారైందో తెలుసుకొని తమకు విక్రయించాలని రైతును కలుస్తారు. బేరం కుదిరితే పగలే రైతులు ఉన్న సమయంలో గంధపు చెట్లను నరుకుతారు. రైతు అంగీకరించకుంటే రాత్రి సమయాల్లో నరికి మాయం చేస్తారు.
రైతులకు కుచ్చుటోపీ...
గంధపు చెక్కుల విలువ రైతులకు తెలియకపోవడం అక్రమార్కులకు వరంగా మారుతోంది. దీంతో స్మగ్లర్లు వారికి కుచ్చటోపీ పెడుతూ లక్షల్లో సొమ్ముచేసుకుంటున్నారు. స్మగ్లర్లు ఒక్కో చెట్టుకు రూ. 1000 నుంచి 2000 వరకు చెల్లిస్తారు. దాంట్లోంచి గంధం తీసి కిలో రూ. 1000 నుంచి రెండు వేల వరకు విక్రయిస్తారు. ఈ ప్రాంతంలో గంధపు చెట్లు నరుకుతున్నవారిలో ఎక్కువ శాతం పూడూరు మండల కేంద్రానికి చెందిన వారని సమాచారం.