‘సంసద్’కు సర్పంచ్‌లు | Sakshi
Sakshi News home page

‘సంసద్’కు సర్పంచ్‌లు

Published Sat, Oct 11 2014 2:59 AM

Presidents went to a conference in Delhi

ఢిల్లీ సదస్సుకు వెళ్లిన ప్రెసిడెంట్లు, జడ్పీ సీఈవో, ఎంపీడీవో
నేడు హైదరాబాద్ నుంచి వెళ్లనున్న కలెక్టర్


ఖమ్మం జెడ్పీసెంటర్: గ్రామాల అభివృదే ్ధ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంసద్ గ్రామ ఆదర్శ్ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరిగే సదస్సుకు హాజరు కావాలని ప్రధాని కార్యాలయం నుంచి లేఖ అందడంతో జడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ్, నేలకొండపల్లి ఎంపీడీవో నవాబ్‌పాషా, ముదిగొండ మండలం మేడేపల్లి సర్పంచ్ కె.నాగలక్ష్మి, బయ్యారం సర్పంచ్ టి.కవిత, ఇల్లందు మండలం రొంపేడు సర్పంచ్ ఎస్.పార్వతి, మధిర మండలం నాగవరప్పాడు సర్పంచ్ సిహెచ్.రామరాజు ఢిల్లీ చేరుకున్నారు.

కలెక్టర్ ఇలంబరితి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్తారు. ఈ పథకం నిర్వహణకు తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్, అదిలాబాద్ జిల్లాలను ఎంపిక చేశారు. ఎంపికైన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నారు. వీటి అభివృద్ధికి ఎంపీల్యాడ్స్ నిధులు కేటాయిస్తారు. 2019 నాటికి ఈ గ్రామాల్లో అన్ని వసతులూ కల్పించేలా ఎంపీలకు భాధ్యతలు అప్పగించనున్నారు.
 
మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది
దేశానికి చెందిన ప్రముఖులు ప్రసంగించే సదస్సుకు ఎంపికయ్యాననే విషయం తెలిసిన వెంటనే మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 12 మందిని ఎంపిక చేస్తే అందులో నేను ఉండటం గర్వంగా భావిస్తున్నా. సదస్సులో ప్రధానమంత్రితో పాటు ప్రముఖుల ప్రసంగాలను పూర్తిగా అవగాహన చేసుకొని బయ్యారం పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా.

- కవిత, బయ్యారం సర్పంచ్
 
గ్రామాభివృద్ధికి కృషి చేస్తా
ప్రధాన మంత్రి పాల్గొని ప్రసంగించే సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఢిల్లీ స్థాయిలో జరిగే సెమినార్‌లో మారుమూల ప్రాంతం నుంచి నన్ను ఎంపిక చేయడంతో ఎంతో గర్వపడుతున్నాను. ఆ సదస్సుతో అవగాహన పెంచుకుని గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.

- సువర్నపాక పార్వతి, సర్పంచ్, రొంపేడు
 
ఇదో మంచి అవకాశం
ఢిల్లీలో జరిగే సదస్సుకు వెళ్లడం ఒక మంచి అవకాశం. మారుమూల గ్రామం నుంచి మాలాంటి వాళ్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలో జరిగే సదస్సుకు హాజరుకావడం మరపురాని అనుభూతి. గ్రామాభివృద్ధికి ఈ సదస్సు ఎంతగానో ఉపకరిస్తుంది. గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు అన్ని రంగాలలో ముందంజలో నిలిపేలా చూస్తా.

- కొత్తపల్లి నాగలక్ష్మి, సర్పంచ్, మేడేపల్లి
 
రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధి
ఢిల్లీలో జరిగే సదస్సుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. తెలంగాణ లోని గంగదేవి పల్లిలా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని చేస్తున్న కృషిఅభినందనీయం. అయితే గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలి. ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి సారించేం దుకు, గ్రామాభివృద్ధిపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తా.

- చావలి రామరాజు, సర్పంచ్, నాగవరప్పాడు

Advertisement
Advertisement