సాగు నీరివ్వాలని పైపును పగులగొట్టారు

Pipe line distroyed by formers - Sakshi

పాలకుర్తి (రామగుండం): సాగునీరు ఇవ్వడంలేదని ఆవేదన చెందిన రైతులు ఏకంగా పైప్‌లైన్‌ జాయింట్‌ను తొలగించారు. దీంతో నీరు 50 మీటర్ల ఎత్తులో ఎగిసిపడింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నందిమేడారం చెరువుకు వెళ్లే ప్రధాన పైపులైన్‌ వాల్వ్‌ను పాలకుర్తి మండల పరిధిలోని మారేడుపల్లి గ్రామ శివారులో పగులగొట్టారు.

వాల్వ్‌కవర్‌ బోల్టులను తీసివేయడంతో నీరు 60 ఎంహెచ్‌పీ వేగంతో దాదాపు 50 మీటర్ల ఎత్తులో ఎగిసిపడింది. సోమవారం వరకు నీటి ఉధృతి కొనసాగింది. విషయం తెలుసుకున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎస్‌ఈ విజయభాస్కర్‌రావు, ఇతర ఇరిగేషన్‌ అధికారులు మోటార్ల సరఫరా నిలిపివేసి మరమ్మతు చర్యలు చేపట్టారు. అక్కడకు చేరుకున్న రైతులు.. నీరు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్థానిక గ్రామాలకు నీరిచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top