జమ్మికుంట(హుజూరాబాద్): ‘నా కొడుకు మతిస్థిమితం కోల్పోయేందుకు కారణమైన లోటస్ ఔషధ కంపెనీ మూతపడాలె.. నాకు న్యాయం జరగకుంటే ఢిల్లీ వరకూ వెళ్తా.. సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలి..’అంటూ ఔషధ ప్రయోగ బాధితుడి తల్లి కమల ఆరోపించింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన చిలువేరి కమల కుమారుడు అశోక్ కుమార్ ఔషధ ప్రయోగంతో మతి స్థిమితం కోల్పోయినట్లు గతనెల 28న వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టారు.
అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కమల ఆదివారం జమ్మికుంటలోని గాంధీ చౌక్ వద్ద నిరసన దీక్షకు దిగింది. ఔషధ ప్రయోగ కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. లోటస్ ఫార్మా కంపెనీపై ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేయకుండా తన కొడుకు శ్యాంసుందర్తో గతనెల 29న తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఆమె ఆరోపించింది.
అశోక్కుమార్కు వైద్య ఖర్చులతోపాటు కుటుంబానికి సహాయం అందిస్తామని, బెంగళూర్కు రావాలంటూ లోటస్ కంపెనీ పేరుతో వచ్చిన లేఖ కరీంనగర్ నుంచి వచ్చిందేనని కమల ఆరోపించింది. బెంగళూర్కు వెళ్తే లోటస్ కంపెనీ సహాయం చేస్తుందని పోలీసులు చెబుతున్నారని, పోలీసులు వస్తే వెళ్తామని పేర్కొంది.