ఈ నెల 24–27 మధ్య పబ్లిక్ ఇష్యూ
హైదరాబాద్: డైవర్సిఫైడ్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల కంపెనీ సాయి పేరెంటరల్స్ పబ్లిక్ ఇష్యూకి తాజాగా రూ. 372–392 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 27న ముగియనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ కంపెనీ రూ. 285 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 32 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి.
కంపెనీ వృద్ధి ప్రయాణంలో ఐపీవో కీలక మైలురాయిగా కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్ కేకే పేర్కొన్నారు. తాము సాధించిన పురోగతిని ఇది ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. వ్యూహాత్మక ప్రణాళికలను వేగవంతం చేసేందుకు తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. తద్వారా తదుపరి విస్తరణ దశకు మద్దతు లభించనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా గ్లోబల్ ఫార్ములేషన్ల బిజినెస్తోపాటు.. ఇంజెక్టబుల్స్, ఓరల్ డోసేజీ ఫార్ములేషన్లలో కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు వివరించారు.


