మందులు అమ్మడానికి వస్తూ.. | One killed in road accident | Sakshi
Sakshi News home page

మందులు అమ్మడానికి వస్తూ..

Oct 31 2017 4:02 PM | Updated on Aug 30 2018 4:15 PM

One killed in road accident - Sakshi

తరతరాలుగా ఆయుర్వేద మందులు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు డివైడర్‌ పైకెక్కి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. తాత, మనువడు మృతి చెందిన ఈ ఘటన ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. 

పెర్కిట్‌(ఆర్మూర్‌): గాంధారి మండలం గుజ్జాల్‌ తండాకు చెందిన సిరిగిరి పవన్, దుర్గమ్మ దంపతులు వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయుర్వేద మందులు విక్రయిస్తుంటారు. పవన్‌ తండ్రి ఎల్ల స్వామి (49) గాంధారి ప్రాంతంలోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఇటీవలే మానేసి ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నాడు. ఆర్మూర్‌ ప్రాంతంలో మందులను విక్రయించడానికి ఎల్ల స్వామి, పవన్, దుర్గమ్మలతో పాటు వారి కుమారుడు వినీత్‌ అలియాస్‌ వినయ్‌ (3) మారుతి కారులో సోమవారం వేకువజామున బయల్దేరారు. మహబూబ్‌నగర్‌లో ఉండే ఎల్ల స్వామి అల్లుడు పొనకంటి నర్సింహులు కుటుంబం సైతం మందులను విక్రయించడానికి ఆర్మూర్‌కు కారులో బయల్దేరారు. రెండు కుటుంబాలు ఇందల్వయి వద్ద కలుసుకున్నాయి.

రెండు కార్లు ఒకదాని వెనుక ఒకటి వస్తుండగా, మామిడిపల్లిలోని 44వ జాతీయ రహదారి వద్ద గల పెట్రోల్‌ బంకు సమీపంలోకి రాగానే ముందుగా వస్తున్న పవన్‌ కారు అదుపు తప్పింది. ఒక్కసారిగా డివైడర్‌ పైనుంచి రాంగ్‌ రూట్‌లోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్‌ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఎల్లస్వామి అక్కడికక్కడే మృతి చెందగా, వినీత్‌తో పాటు పవన్, దుర్గమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వెనుక కారులో వస్తున్న ఎల్లస్వామి అల్లుడు నర్సింహులుకు ముందున్న కారు కనబడక పోవడంతో అనుమానం వచ్చి రోడ్డు పక్కన కారు ఆపాడు. నడుచుకుంటూ వెనక్కు వెళ్లి చూడగా రాంగ్‌రూట్‌లో ప్రమాదానికి గురైన కారు కనిపించింది.

 హ్రుటాహుటిన అక్కడకు చేరుకొని చూడగా, మామ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన పవ¯న్, దుర్గమ్మ, మేనళ్లుడు వినీత్‌ కనిపించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మేనళ్లుడిని బతికించుకోవడానికి పెర్కిట్‌లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతడు తుది శ్వాస విడిచాడు. తీవ్ర గాయాలతో ఉన్న పవన్, దుర్గమ్మలను జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని రహదారిపై ఉన్న కారును క్రేను సహాయంతో తొలగించి, మృతదేహాలను ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు ప్రమాదంలో తమ గ్రామస్తులు మృతి చెందడంతో గాంధారి జెడ్పీటీసీ తానాజీ, ప్రజాప్రతినిధులు ఆర్మూర్, నిజామాబాద్‌ ఆస్పత్రులకు తరలి వచ్చారు. నిద్రమత్తులో అజాగ్రత్తగా కారు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement