గట్టి బందోబస్తు

Nizamabad Police Commissioner Talk On Panchayat Elections - Sakshi

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సీపీ సమీక్ష 

348  సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు

నిజామాబాద్‌అర్బన్‌: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ గట్టి బందోబస్తును చేపట్టనుంది. పోలీసు కమిషనర్‌ కార్తికేయ గురువారం పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల నియమావళి తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 4,932 పోలింగ్‌ కేంద్రాల్లో 348 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు, అదనపు భద్రత చేపట్టనున్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రతలపై అప్రమత్తం చేస్తారు. జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఆయా గ్రామాల్లో పోలీసు అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు.

అవసరమైన ప్రాంతాల్లో, సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీలు, గతంలో వివాదాలు జరిగిన ప్రాంతాల్లో మూడంచెల పద్ధతిని చేపట్టే అవకాశం ఉంది. ఆయా గ్రామాల్లో, మండలాల్లో బైండోవర్‌లు చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా వివరాలు నమోదు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సీపీ కార్తికేయ స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతి గ్రామాన్ని పోలీసులు తప్పనిసరిగా సందర్శించి సమస్యలు తెలుసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ మాదిరిగానే వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. పెట్రోలింగ్‌ చేపట్టనున్నారు. నగదు, మద్యం పంపిణీలను నిరోధించేందుకు తనిఖీ బృం దాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల నిర్వహణపై సీపీతో పాటు ఏసీపీలు , డీఎస్పీలు, పర్యవేక్షణ ముమ్మరం చేయనున్నారు.
 
సమావేశంలో ఆదేశాలు.. 
సమీక్ష సమావేశంలో సీపీ కార్తికేయ పోలీసు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ అంశాలను, మండలాలు, గ్రామాల వారీగా పోలింగ్‌ బూత్‌ల వివరాలు తెలియజేశారు. సమావేశంలో శిక్షణ ఐపీఎస్‌ అధికారి గౌస్‌అలాం, ఏసీపీలు శ్రీనివాస్‌కుమా ర్, రాములు, రఘు, ప్రభాకర్‌రావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది  పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top