కీలక నేతలంతా మావెంటే..  | Miryala Raji Reddy Comments on Kengarla Mallayya Resignation | Sakshi
Sakshi News home page

కీలక నేతలంతా మావెంటే.. 

Sep 15 2019 9:50 AM | Updated on Sep 15 2019 9:50 AM

Miryala Raji Reddy Comments on Kengarla Mallayya Resignation - Sakshi

మాట్లాడుతున్న మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): ‘సంఘంలో కీలక నేతలంతా మావెంటే ఉన్నారు.. కొంత మంది అవకాశవాదులు సంఘాన్ని వీడితే ఒరిగే నష్టమేమి లేదు.. రాజీనామా చేసిన వారిలో కీలక పదవులున్న వారెవరూ లేరు’ అని టీబీజీకేఏస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11మెన్‌ కమిటీ సభ్యులు, సెంట్రల్‌ కమిటీ నాయకులు, డివిజన్‌ ఉపాధ్యక్షుల్లో ఎవరూ సంఘాన్ని వీడలేదన్నారు. రాజీనామా చేసిన వారిలో ఇద్దరికి మాత్రమే ప్రస్తుతం పదవులున్నాయని తెలిపారు. ఎక్కడ ప్రకంపలున్నాయని, ఎక్కడ యూనియన్‌ బద్ధలైందని ఆయన ప్రశ్నించారు. ఏడు గనులను తిరిగి సింగరేణి వ్యాప్తంగా పర్యటించామని, కార్మికులంతా తమ వెంటే ఉన్నారని బయటకు వెళ్లిన వారు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. స్వార్థంతో  సంఘాన్ని విమర్శించడం సరికాదన్నారు. వలసవాదులెవరూ తమ యూనియన్‌లో లేరని, ఈ పదాన్ని వాడడాన్ని ఆయన ఖండించారు.

పురుడు పోసింది కెంగర్ల కాదు.. 
యూనియన్‌కు పురుడు పోసింది కెంగర్ల మల్ల య్య కాదని, గోదారిఖనిలో టీబీజీకేఏస్‌ యూనియన్‌ ఆరంభం నుంచి  ప్రస్తుత సంక్షేమ మంత్రి గా కొనసాగుతున్న కొప్పుల ఈశ్వర్‌ కీలక పాత్ర పోషించారని రాజిరెడ్డి తెలిపారు. అలాగే పీటీస్వామి వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగారన్నారు. కొప్పుల లక్ష్మిరాజం, ఆంధ్రయ్య సంఘం లో ప్రముఖ పాత్ర పోషించారని, తానే పురుడు పోశామని చెప్పడం అర్థరహితమని అన్నారు. యూనియన్‌కు ఓనర్లంటూ అహంతో మాట్లాడుతున్నారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం సంఘాన్ని బదనాం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  తాము కార్మికులకు పోగొట్టిన హక్కులు ఏమిటో చెప్పాలని సవాల్‌ చేశారు. సమావేశంలో నాయకులు నూనె కొమురయ్య ధీకొండ అన్నయ్య, గండ్ర దామోదర్‌రావు, సంపత్, ఐలి శ్రీనివాస్, కొత్త సత్యనారాయణరెడ్డి, దేవ వెంకటేశం, శ్రీనివాస్‌రావు, తిరుపతి, సురేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, వీర భద్రయ్య, మంగిలాల్, మల్లారెడ్డి పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement