కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి

Published Fri, Nov 24 2017 2:51 AM

Make fabulous arrangements - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)తో పాటు హైదరాబాద్‌ మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎస్పీ సింగ్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశిం చారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షిం చారు.

బేగంపేట, శంషాబాద్‌ విమానాశ్రయాలు, మియాపూర్, హెచ్‌ఐసీసీ, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ ప్రాంతాల్లో ఏర్పాట్లపై సమీక్షించారు. బేగంపేట విమానా శ్రయంలో ప్రధానికి స్వాగ తం పలకడానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికా రులను ఆదేశించారు. ప్రధాని పర్యటించే మార్గంలోనూ.. విదేశీ అతిథులు బస చేసే ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. జీఈఎస్‌కు వచ్చే అతిథుల కోసం శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

జీఈఎస్‌ను ప్రారంభించే ముందు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తార న్నారు. వివిధ సంస్థల సీఈవోలతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ పాల్గొం టారన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని ఇచ్చే విందుకు అతిథులను హెచ్‌ఐసీసీ నుంచి తీసుకువెళ్లడానికి పకడ్బంది ప్రణాళిక రూపొందించాలని, అక్కడ సాంస్కృతిక కార్య క్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీఈఎస్‌ అతిథులకు గోల్కొండ కోటలో ఇచ్చే విందుకు అన్ని ఏరాట్లు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement