‘రుణమాఫీ’కి సమాయత్తం

Loan Waiver Scheme Approved Soon in Mahabubnagar - Sakshi

కసరత్తు మొదలుపెట్టిన అధికారులు

26అంశాల వారీగారైతుల సమాచారం సేకరణ  

ఉమ్మడి జిల్లాలో 5.42లక్షల మందికి ప్రయోజనం

రూ.25వేలలోపు ఉంటే ఈ ఏడాదే లబ్ధి

రైతులకు కొండంత ఆత్మస్థైర్యాన్నిచ్చి ఆర్థికంగావెసులుబాటు కల్పించిన రుణమాఫీ పథకం అమలుకు సన్నాహాలు మొదలయ్యాయి. పంట రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు నోటీసులు జారీ చేసినా.. ముక్కుపిండి వడ్డీ కట్టేలా బలప్రదర్శనకు దిగినా.. సహనంతో అప్పులు చేసి రైతులు కట్టారు. రుణమాఫీ ఆదుకుంటుందనే భరోసాతో ప్రభుత్వంపై భారం వేసి కుటుంబాలను వెళ్లదీస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల హామీ ఎట్టకేలకు పట్టాలెక్కుతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనున్నట్టు 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంది. నాలుగు విడతలుగా 25 శాతం చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలోనూ మళ్లీ రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వరుస ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ అమలులో జాప్యం చోటు చేసుకుంది. దీనిపై తెలంగాణ ఆవిర్భావం రోజు అధికారికంగా ప్రకటిస్తారని భావించినా.. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో దాని ఊసే లేకుండా పోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8న అసెంబ్లీలో బడ్జెట్‌  ప్రవేశపెట్టిన సందర్భంగా రైతు రుణమాఫీ అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రుణమాఫీకి సంబంధించినమార్గదర్శకాలను మూడు రోజుల క్రితమే రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి జారీ చేశారు.

కటాఫ్‌ తేదీ 2018 డిసెంబర్‌ 11  
రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలకు రూపకల్పన చేసింది. రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి జి ల్లాల వారీగా బ్యాంకులు, పంట రుణాల మొ త్తం, రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల వి వరాలు సేకరించింది. గతంలో 2018 డిసెంబ ర్‌ 11 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకర్లు రుణమాఫీ అర్హులను తేల్చేపనిలో నిమగ్నమయ్యారు. 26 అంశాలతో వివరాలను సేకరించనున్నారు. ప్రభుత్వ ప్రకటన మేరకు నిర్ణీత తేదీ కంటే ముందు బకాయిలు ఉన్న రైతుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. రైతు పేరు, ఖాతా నంబర్, ఆధార్‌ కార్డు, తీసుకున్న రుణం, అసలు, వడ్డీ కలిపి మొత్తం, ఫోన్‌ నంబర్, తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని సేకరించి నమోదు చేయాలని సూచించారు. బ్యాంకుల వారీగా వివరాలు ఆరా తీయనుండగా వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

2014లో 4 దఫాలుగా...
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కటాఫ్‌ తేదీని నిర్ణయించి ‘రుణమాఫీ’ మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు నాలుగు దఫాలుగా రుణమాఫీ నిధులు విడుదల చేసింది. 2014లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం రైతులు 6,07,813 మందికి గాను రుణమాఫీకి 5,98,990 మంది అర్హత సాధించారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ.2,725.83 కోట్లు కేటాయించింది.

రూ.25వేల లోపైతే ఒకేసారి..
2018 డిసెంబర్‌ 11 కంటే ముందున్న పంట రుణాలన్నింటిని మాఫీ చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. రుణమాఫీతో సంబంధం లేకుండా తీసుకున్న రుణాలను చెల్లించి మళ్లీ తీసుకోవాలని, రుణమాఫీకి చెందిన డబ్బులు చెక్‌ రూపంలో నాలుగు విడతల్లో ఇస్తామని ప్రకటించారు. తాజాగా రూ.25వేల లోపు పంట రుణం ఉన్న రైతులకు ఒకేసారి అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు విడతల వారీగా మాఫీ సొమ్ము అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.25వేల లోపు పంట రుణం మొత్తం ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించడంతో సన్న, చిన్నకారు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తక్కువ రుణం ఉన్నా.. విడతల వారీగా రావడంతో అవి వడ్డీకే సరిపోయేవి. రూ.20వేలు రుణం ఉంటే విడతల వారీగా రూ.ఐదు వేల చొప్పున జమ చేశారు. తాజా ప్రకటనతో రూ.25వేల లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు లక్ష మంది ఉంటారని బ్యాంకర్ల అంచనా. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5.42 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. అయితే గతంలో గడువులోగా రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ చేయకపోగా అప్పు ఉన్న వారికే విడతల వారీగా ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ముందు జాగ్రత్తగా చాలామంది రెన్యువల్‌ చేసుకోలేదు. నిర్ణీత తేదీని తెలియజేసి రుణాలు చెల్లించినా.. రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించడంతో ఈ సీజన్‌లో తిరిగి బకాయిలు చెల్లించి కొందరు రైతులు రుణాలు పొందారు. ఇప్పుడు మాఫీ చేస్తే వడ్డీ సొమ్మును ఎప్పటి వరకు లెక్కిస్తారనేది తేలాల్సి ఉంది.

సందేహాలెన్నో..?
గతంలో జరిగిన ‘రుణమాఫీ’లో ఎదురైన స మస్యలు మళ్లీ పునరావృతమవుతాయా అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలేవీ రాలేదని వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకర్లు చె బుతున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చే యాల్సి ఉంది. చాలామందికి రెండు ప్రాంతా ల్లో భూములు ఉండి పాసు పుస్తకాలు ఉన్నా యి. వేర్వేరు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం ఉంది. రెండు మాఫీ చేస్తారా..  ఏదో ఒకటి చేస్తారా.. అలాగే కుటుంబానికి రూ.లక్ష మాఫీ చేస్తే ఒకే కుటుంబంలో ముగ్గురి పేరున కలిపి రూ.1.25 లక్షల రుణం ఉంటే ఎంత మాఫీ అవుతుంది. గత రుణమాఫీలో మొదట బంగారం తాకట్టుపెట్టిన రుణాలకు వర్తించలేదు. తదుపరి ఆదేశాలతో కొంతమందికి మాఫీ అయింది. తాజాగా బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకున్నారు. బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను పంట రుణాల కింద చూపవద్దని రిజర్వు బ్యాంకు ఆదేశించింది. వాటిని పరిగణలోకి తీసుకుంటారా.. లేదా, రుణమాఫీతో సంబంధం  లే కుండా పంట రుణం కింద తీసుకున్న రుణా న్ని కొంతమంది రైతులు గడువులోగా చెల్లించారు. ఇలాంటి వారు గత రుణమాఫీలో ఉండగా వీరికి మాఫీ వర్తించలేదు. ఈ దఫా రు ణాలను సకాలంలో చెల్లించిన వారికి మాఫీ చే స్తారా? దీర్ఘకాలంగా బ్యాంకులకు అప్పులు క ట్టకుండా మొండి బకాయిదారుల జాబితాలో చేరిన వారికి మాఫీ ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రుణమాఫీ చేసిన సందర్భంలో రైతులు తీసుకున్న పంట రుణాలను కొన్ని బ్యాంకులు రీషెడ్యూ లు చేయడంతో సంబంధిత రైతులకు వర్తించలేదు. అందులో చాలామంది ఇప్పటికీ రుణాలను చెల్లించలేదు. వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది.

వివరాలు సేకరిస్తున్నాం
రూ.లక్షలోపు అప్పు తీసుకున్న రైతులు ఎంతమంది ఉంటారో స్పష్టంగా చెప్పలేం. ఈ వివరాలు ఇవ్వాలని ఆయా బ్యాంకర్లకు చెప్పాం. వారు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో ఈ సమాచారం మాకు అందుతుంది. అలాగే మార్గదర్శకాలు సైతం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.    – నాగరాజకుమార్, లీడ్‌ బ్యాంకు మేనేజర్, మహబూబ్‌నగర్‌ జిల్లా

ఏకకాలంలో మాఫీ చేయాలి
రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలి. రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న రైతులు సైతం రూ.లక్ష వరకు బ్యాంకుల్లో రుణం తీసుకున్నారు. కొందరు మాత్రమే తక్కువ రుణం తీసుకున్నారు. చిన్న రైతులకు ప్రాధాన్యతనివ్వడం మంచిదే. అయితే రూ.లక్ష లోపు రుణం ఉన్న రైతులకు నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తే ఆ డబ్బు వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది. – వెంకటేశ్వర్‌రెడ్డి, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ మండలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top