కారెక్కిన కాసాల బుచ్చిరెడ్డి | Kasala Buchi Reddy Join In TRS Sangareddy | Sakshi
Sakshi News home page

కారెక్కిన కాసాల బుచ్చిరెడ్డి

Nov 3 2018 1:10 PM | Updated on Mar 29 2019 9:07 PM

Kasala Buchi Reddy Join In TRS Sangareddy - Sakshi

హరీశ్‌రావు సమక్షంలో పార్టీలో చేరుతున్న కాసాల

సాక్షి, సంగారెడ్డి జోన్‌: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజీనామా చేసిన కాసాల బుచ్చిరెడ్డి  శుక్రవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. సంగారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్, సీడీసీ చైర్మన్‌ విజేందర్‌రెడ్డి, గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ నరహరిరెడ్డి,  మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొండల్‌రెడ్డితో కలిసి కాసాల బుచ్చిరెడ్డి  పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లు పార్టీలో పని చేసి పార్టీని వీడడం బాధాకరంగా ఉందన్నారు. కార్యకర్తలు, ప్రజలకు సహాయం, సేవ చేయాలన్న లక్ష్యంతోనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. స్వతహాగా రైతుబిడ్డనైన తనను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సాగుకు పెట్టుబడి సాయం, రైతుబంధు పథకం, రైతుబీమాతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా వంటివి ఆకట్టుకున్నాయన్నారు.

ప్రశ్నార్థకమవుతున్న కులవృత్తులను ప్రోత్సహించి వాటి మనుగడ కోసం టీఆర్‌ఎస్‌ కృషి చేస్తోందన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌ గెలుపు కోసం తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, మంత్రి హరీశ్‌రావు ఏ పని అప్పగించినా ఉమ్మడి జిల్లాలో చేయడానికి సిద్ధంగా తరువాయిఉన్నట్లు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. బుచ్చిరెడ్డి చేరికతో పార్టీలో బలం పెరిగిందని అన్నారు. నమ్మకంతో పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుం దన్నారు. ఉమ్మడి  జిల్లాలో పని చేసిన అనుభవం ఉండడంతో బుచ్చిరెడ్డి సేవలను వినియోగించుకుంటామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుచ్చిరెడ్డితోపాటు పార్టీలో చేరిన వారిలో విజయలక్ష్మి, చంద్రారెడ్డి, కృష్ణ, శమంత, విష్ణువర్థన్, ఉమారాణి, కవిత, మదుసూదన్, సుధీర్‌రెడ్డి, సాయికృష్ణ, బాబు, అశోక్, చారి ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement