కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా రవీందర్‌సింగ్ | karimnagar mayor Ravinder singh! | Sakshi
Sakshi News home page

కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా రవీందర్‌సింగ్

Jun 28 2014 3:18 AM | Updated on Aug 15 2018 9:20 PM

కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్‌గా టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సిం గ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఎమ్మెల్యే గం గుల కమలాకర్ శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు.

కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్‌గా టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు సర్దార్ రవీందర్‌సిం గ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఎమ్మెల్యే గం గుల కమలాకర్ శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రవీందర్‌సింగ్‌ను మేయర్‌గా, గు గిల్లపు రమేశ్‌ను డెప్యూటీ మేయర్‌గా, ఫ్లోర్‌లీడర్‌గా మహ్మద్ ఆరిఫ్, విప్‌గా కంసాల శ్రీనివాస్ పేర్లను ప్రకటించారు.
 
 ఈ నలుగురి పేర్లు ఫలితాలు వెలువడిన నాటినుంచే ప్రచారంలో ఉన్నా పరోక్ష ఎన్నికల తేదీ ఖరారైన తర్వాతే వెల్లడించాలని ఇన్ని రోజులు జాప్యం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే కమలాకర్  హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికపై చర్చించారు. గతంలో ఎంపిక చేసిన పేర్లనే ఖరారు చేసిన సీఎం.. అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు సమానప్రాతినిథ్యం కల్పించినట్లు వెల్లడించారు.
 
 నాలుగుసార్లు మున్సిపల్‌లో ప్రాతినిథ్యం
 ఇరవై ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న రవీందర్‌సింగ్ ఒక పర్యాయం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. చాలాకాలం పాటు బీజేపీలో కొనసాగారు. ఆపార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం 2006లో ఆయన సమక్షంలో రవీందర్‌సింగ్ టీఆర్‌ఎస్‌లో చేరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా మెదులుతున్నారు. గతంలో రవీందర్‌సింగ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కరీంనగర్ నుంచి పలువురు నేతలు ఎమ్మెల్సీగా రవీందర్‌సింగ్‌ను ఎంపిక చేయాలని కేసీఆర్‌ను కోరారు. సామాజిక సమీకరణల వల్ల ఎమ్మెల్సీ పదవి దక్కలేదని తెలిసింది. ప్రస్తుతం రవీందర్‌సింగ్ టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడిగా పనిచేస్తూ 24వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా, రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. మున్సిపల్ పాలనపై  పట్టున్న రవీందర్‌సింగ్‌ను ఎన్నికల ముందు నుంచే మేయర్ అభ్యర్థిగా ప్రచారం చేశారు. నగరంలోని సుమారు 50 సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి పూర్తి మెజారిటీ ఉండడంతో ఇక మేయర్ పదవి రవీందర్‌సింగ్‌కు లాంఛనమే కానుంది.
 
 మార్పులు లేకుండానే..
 మేయర్‌తో పాటు డెప్యూటీ మేయర్, ఫ్లోర్‌లీడర్, విప్ పదవులకు గతంలో ఎంపిక చేసిన అభ్యర్థులనే ప్రకటించారు. డెప్యూటీ మేయర్ అభ్యర్థి గుగ్గిల్లపు రమేశ్ ఒకసారి కౌన్సిలర్‌గా, ఒకసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గత పాలక వర్గంలో ఆయన సతీమణి మంజుల కూడా కార్పొరేటర్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే గంగులకు అత్యంత సన్నిహితుడైన రమేశ్ గతంలో టీడీపీలో నగర అధ్యక్షుడిగా పనిచేశారు.
 
 గంగుల టీఆర్‌ఎస్‌లో చేరడంతో రమేశ్ కూడా ఆయన బాటలోనే నడిచారు. ప్రస్తుతం 18వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందాడు. ఫ్లోర్ లీడర్ అభ్యర్థిగా ఎన్నికైన మహ్మద్ ఆరిఫ్ 6వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎంఐఎం అభ్యర్థిపై గెలుపొందారు. ఎంఐఎంకు పట్టున్న 6వ డివిజన్ నుంచి గెలుపొంది సత్తా చాటుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. విప్ అభ్యర్థి కంసాల శ్రీనివాస్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజాసంఘాల జేఏసీలో కీలకంగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌లో చేరి 5వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
 
 విహారయాత్రకు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు
 పూర్తి మెజారిటీ ఉండడంతో ఎలాంటి క్యాంపులు అవసరం లేదని మొదట భావించినా కార్పొరేటర్ల కోరిక మేరకు విహారయాత్రకు వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే కమలాకర్ తెలిపారు. మహిళా కార్పొరేటర్లు అధికంగా ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి యాత్రకు వెళ్లనున్నారు. నేడో రేపో విహారయాత్రకు బయలు దేరే కార్పొరేటర్లు జులై 3వ తేదీన జరిగే మేయర్ ఎన్నికకు ముందు రోజు తిరిగి వస్తారన్నారు. పుణ్యక్షేత్రాలతో పాటు వివిధ ప్రాంతాలను చూసి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement