ఇది మల్లెల మాసమనీ..

Jasmine Flower Season Starts in Hyderabad - Sakshi

మల్లెల సీజన్‌ వచ్చేసింది

సిటీకి రోజూ 5865 కేజీల దిగుమతి

ఏపీ, తెలంగాణ ప్రాంతాలనుంచి తెస్తున్న రైతులు

సాక్షి సిటీబ్యూరో: మల్లెలను ఇష్టపడని వారంటూ ఉండరు...మల్లె పరిమళాలు ప్రతి ఒక్కరి మనస్సు ను దోచుకుంటాయి. అల్లుకున్న మల్లె పందిరి నీడకు అందాల జాబిలి తోడైతే అద్భుత అనుభూతి కలుగుతుంది. అందుకే ఎందరో కవులు మల్లెలపై మరుపురాని గీతాలు రాశారు, కొందరైతే సినిమాలే తీసారంటే మల్లెలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. ప్రతి రకం పూలల్లో ఏదోకరమైన వాసన ఉంటుంది. అయితే మల్లెపూల వాసనే వేరు. మల్లె మొగ్గలు వికసించిన కొద్దీ వాసన వెదజల్లుతునే ఉంటుంది. అన్నిపూలకంటే మల్లెల వాసన ఎక్కువ దూరం వరకు వస్తుంది. ప్రకృతి నియమం ప్రకారం ఈ పువ్వు ఎండకాలంలో వస్తుంది...

సీజన్‌ ఆగస్టు వరకు...
నగరంలోని గుడిమల్కాపూర్‌ ఇంద్రారెడ్డి పూల మార్కెట్‌తో పాటు మొజంజాహీ పాత పూల మార్కెట్‌కు మల్లెలు పెద్ద ఎత్తున వివిధ ప్రదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వివిధ రాష్ట్రాలతో పాటు నగర శివారు ప్రాంతాల నుంచి రోజూ దాదాపు 5865 కేజీల  మల్లె మొగ్గలు చేరుతున్నాయి. మార్చి నుంచి ప్రారంభమైన సీజన్‌ ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఈ ఆరు మాసాలు నగరమంతా మల్లెల మయంగా ఉంటుంది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 1490 కేజీలు మల్లె మొగ్గలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌లో ప్రధానంగా మూడు రకాల మల్లెలు అందుబాటులో ఉన్నాయి. నాటు మల్లె,  కాగడ మల్లె,  గుండు మల్లె కాగడ మల్లె కాస్త పొడువుగా ఉంటుంది. 

జిల్లాల నుంచి రాక...  
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ లోని షాబాద్,  మొయినాబాద్, శంషాబాద్‌తో పాటు వికారబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి నుంచి నగర మార్కెట్‌కు మల్లెలు దిగుమతి అవుతాయి. ప్రధానంగా విజయవాడ, కర్నూల్, మైలవరం, కడప ప్రాంతాల నుంచి నిత్యం రోజూ 15 నుంచి 20 వాహనాల్లో మల్లె మొగ్గలు గడిమల్కాపూర్‌ మార్కెట్‌కు వస్తున్నాయి. ఇక్కడ దాదాపు 50–60 షాపుల్లో ప్రత్యేకంగా మల్లె మొగ్గలు విక్రయిస్తుంటారు. 

రోజు 5865 కేజీల దిగుమతులు...
గుడి మల్కాపూర్‌ పూల మార్కెట్‌కు దాదాపు రోజూ 5865 కిలోల మల్లె మొగ్గలు వస్తాయి.  మొజంజాహీ పాత పూల మార్కెట్‌ కావడంతో అక్కడ కూడా వెయ్యి కిలలో  వరకు మల్లె మొగ్గలు దిగుమతి అవుతాయని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మల్లె మొగ్గల ధర కిలో రూ. 150 నుంచి రూ. 180వరకు విక్రయిస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో కిలో ధర రూ.120– రూ.150 వరకు ఉందిమల్లెపూల సీజన్‌ ఆగస్టు వరకు ఉంటుంది. ఈ సీజన్‌లో కడప, మైలవరం విజయవాడ నుంచే కాకుండా నగర చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు తీసుకొస్తున్నారు. మార్కెట్‌కు ఈ ఏడాది సీజన్‌ ప్రారంభంలో నుంచే నగర శివారు ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తున్నాయి. మార్కెట్‌లో  మల్లె మొగ్గలను కూలింగ్‌ బాక్స్‌లో ఉంచడానికి సౌకర్యాలు ఉన్నాయి. మల్లెలతో పాటు ఇతర పూలను మార్కెట్‌కు తీసుకొచ్చే రైతులను గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు అదే రోజు డబ్బులు అందేలా చూస్తున్నాం. కమిషన్‌ ఏజెంట్టు ఎమైన ఆక్రమాలకు పాలుపడితేఫిర్యాధు చేయాలని రైతులకు తెలియజేస్తున్నాం.– కే. శ్రీధర్, స్పెషల్‌ గ్రేడ్‌  కార్యదర్శిగుడిమల్కాపూర్‌ మార్కెట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top