‘మహిళ’లకు మొండి చేయి! | Interest on bank loans, the burden of linkages | Sakshi
Sakshi News home page

‘మహిళ’లకు మొండి చేయి!

Feb 19 2015 4:36 AM | Updated on Sep 2 2017 9:32 PM

మహిళా సంఘాలకు అండగా ఉంటామన్న ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోవడం లేదు.

- బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారం
- అమలు కాని వడ్డీ లేని రుణాల పథకం
- జిల్లాలోని మహిళా సంఘాలకు
- బకాయి రూ. 46.40 కోట్లు

మోర్తాడ్ : మహిళా సంఘాలకు అండగా ఉంటామన్న ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోవడం లేదు. వడ్డీ లేని రుణం పథకం ఎక్కడా కానరావడం లేదు. దీంతో మహిళలు తాము తీసుకున్న బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారాన్ని మోయూల్సివస్తోంది. బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి ప్రతి నెలా కిస్తులు సక్రమంగా చెల్లించే మహిళా సంఘాలకు.. వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం రీరుుంబర్స్‌మెంట్ రూపంలో ఖాతాల్లో జమ చేస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం జూన్ 2014లో ఏర్పాటు అయినా ఏప్రిల్ 2014 నుంచి ఉన్న వడ్డీ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా గతంలో ప్రకటించారు. గత డిసెంబర్ నాటికి జిల్లాలోని మహిళా సంఘాల ఖాతాల్లో రూ. 46.40 కోట్లు వడ్డీ సొమ్ము జమ కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నయాపైసా వడ్డీని వాపసు చేయలేక పోయింది. దీంతో మహిళలు తమ బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారాన్ని యధాతథంగా మోస్తున్నారు.
 
జిల్లాలో 39,473 మహిళా సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో 4,24,574 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. బ్యాంకు లింకేజీ రుణాల కిస్తులను సక్రమంగా చెల్లించి వడ్డీ మాఫీ కోసం అర్హత పొందిన సంఘాలు జిల్లాలో 33,742 ఉన్నాయి. మహిళా సంఘాలు వడ్డీ మాఫీకి అర్హతను సంపాదించుకోవడం కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా రుణాల కిస్తులను వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించారుు. వడ్డీ మాఫీకి అర్హత పొందిన సంఘాల వివరాలను ఇందిర క్రాంతి పథం అధికారులు ఎప్పటికప్పుడు సెర్ప్ ఉన్నతాధికారులకు చేరవేశారు. నివేదికల ఆధారంగా ప్రభుత్వం వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాల్సి ఉంది.

2014 ఏప్రిల్ నుంచి వడ్డీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద లెక్కలు సిద్ధంగా ఉన్నా నిధులు కేటాయించడంలో తాత్సారం జరుగుతోంది. బ్యాంకు లింకేజీ రుణాలు పొందిన మహిళా సంఘాల సభ్యులు ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారే. తమ కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం బ్యాంకు లింకేజీ రుణాలను పొందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్డీ మాఫీకి సంబంధించిన రీరుుంబర్స్‌మెంట్‌ను చెల్లించాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement