3.50 లక్షల మంది మహిళలకు రూ.304 కోట్ల రుణాలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
సాక్షి, హైదరాబాద్: మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. ఈ కా ర్యక్రమాన్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్లను ఆదే శించారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో మండల సమాఖ్యలతో పాటు గ్రామ సమాఖ్యల ముఖ్యులందరూ పాల్గొనేలా చూడాలని సూచించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని వదిలేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టడంతో మహిళల్లో ఒక నమ్మకం, ధైర్యం వచ్చిందన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు దఫాలుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. నేడు మరోసారి పెద్దఎత్తున రుణాలు పంచబోతున్నామని వివరించారు.
రాష్ట్రంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్లు అద్భుతంగా నిర్వహించారన్నారు. నాణ్యతతో కూడిన మంచి డిజైన్లు కలిగిన చీరలను పంపిణీ చేశారని మహిళలు ఆనందం వ్యక్తం చేశారని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ చీరలు చేరవేయడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విజయవంతం చేసినందుకు వారిని అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్లో ములుగునుంచి పీఆర్ మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.


