ఎర్రచందనం చెట్లు పెంచుతాం | Increase in red wood trees | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం చెట్లు పెంచుతాం

Oct 20 2014 1:03 AM | Updated on Sep 2 2017 3:06 PM

ఎర్రచందనం చెట్లు పెంచుతాం

ఎర్రచందనం చెట్లు పెంచుతాం

రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు.

దక్షిణకొరియా జీవవైవిధ్య సదస్సులో హరితహారానికి అపూర్వ స్పందన
అటవీమంత్రి జోగురామన్న

 
 
హైదరాబాద్: రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న  ప్రకటించారు. అలాగే, వచ్చే మూడు సంవత్సరాలలో  రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల చెట్లను  నాటుతామని  ఆయన చెప్పారు. దక్షిణ కొరియాలో  జరిగిన ప్రపంచ 12వ జీవవైవిధ్య సదస్సుకు హాజరై  తిరిగి వచ్చిన మంత్రి ఆదివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో హరిత హారం  కార్యక్రమం క్రింద  అటవీ విస్తరణను పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్‌పథకం గురించి ఆ సదస్సులో వివరించగా మంచి స్పందన లభించిందని  ఆయన తెలిపారు. సర్పంచ్‌లు చైర్మన్‌గా మొత్తం 600 జీవవైవిధ్య కమిటీలను  ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో 40 వేల చెట్లను  నాటాలనే లక్ష్యాన్ని సదస్సులో వివరించినట్టు చెప్పారు. జీవవైవిధ్యంతో  పట్టణాలను కూడా స్మార్ట్‌సిటీలుగా  తీర్చిదిద్దాలని  సదస్సులో సూచించారని తెలిపారు. అయితే  భారత్‌లో  70 శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తారు కాబట్టి తెలంగాణలో మాత్రం ‘స్మార్ట్‌విలేజ్’లను అభివృద్ది  చేయడం తమ లక్ష్యమని వివరించిన ట్టు ఆయన తెలిపారు.

జీవవైవిధ్యానికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని  ఈ సదస్సు తీర్మానించిందని వివరించారు. ఎర్రచందనం చెట్ల పెంపకానికి ఏపీ భూములే అనువుగా ఉన్నాయనేది నిజం కాదని, తెలంగాణలోనూ వీటిని పెంచడానికి  ఆస్కారం ఉందని  మంత్రి పేర్కొన్నారు. పట్టాభూములలో వీటిని పెంచడానికి సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని  జోగురామన్న తెలిపారు. ఎర్రచందనం పట్ల చైనా ఆసక్తి చూపుతుందని, దీనిని ఎగుమతి చేయకుండా ఇక్కడే ఫర్నిచర్‌ను తయారు చేయించి ఎగుమతి చేసే ఆలోచన ఉందన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement