ఉక్కపోత | Sakshi
Sakshi News home page

ఉక్కపోత

Published Thu, May 22 2014 3:03 AM

Hot temperature in karimnagar district

కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : భానుడు తన ప్రతాపంతో జిల్లా ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. వేసవి సెగలతో జిల్లా భగభగ మండుతోంది. ఎండలకంటే ఉక్కపోత పెరిగిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గాలితో తేమశాతం తగ్గుతుండడంతో భరించలేని ప్రజలు... చల్లగాలుల కోసం కూలర్లు, ఏసీల వైపు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో రోజూ ఓ వైపు మేఘాలు కమ్ముకుని వర్షం కురుస్తున్నా... ఉక్కపోత మాత్రం ఎక్కువగా ఉంది.
 
 ఉదయం 8గంటల నుంచే సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడు. మధ్యాహ్నం రోడ్లపైకి రావడానికి జనం జంకుతున్నారు. సాయంత్రం 7దాటినా వేడి సెగలు తగ్గడం లేదు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానీయాలు, చలివేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఏసీ, కూలర్లు, ఫ్యాన్ల ముందు నుంచి పక్కకు జరిగేందుకు కూడా సాహసించడం లేదు. బయటకు వెళ్లిన నిమిషంలోనే చెమటతో దుస్తులన్నీ తడిసిపోతున్నాయి. ఎండ, ఉక్కపోతతో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, సింగరేణి కార్మికులు విలవిల్లాడుతున్నారు.
 
 ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తేమశాతం
 ఒక్కసారిగా గాలితో తేమశాతం తగ్గిపోయింది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 40.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 26.0డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 28శాతంగా నమోదైంది. జిల్లాలో బుధవారం ఉక్కపోత తీవ్రస్థాయికి చేరింది. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలు నమోదు కాగా.. తేమ శాతం 35గా నమోదైంది. బుధవారం ఇది 28 శాతానికి పడిపోవడంతో ఉక్కపోత విపరీతంగా పెరిగిపోయింది.
 

Advertisement
Advertisement