ఉన్నతస్థాయి కమిటీపై వైఖరి చెప్పండి

Higher Committee for Sexual Assault in the Film Industry - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసే విషయంలో వైఖరి తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సినీ పరిశ్రమలో అసంఘటిత వర్గంగా ఉన్న మహిళల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను కూడా వివరించాలంది. తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

సినీ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వి.సంధ్యారాణి, మరో ఆరుగురు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇటీవల సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ వాదనలు వినిపిస్తూ సినీపరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై సమగ్ర దర్యాప్తు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

ఇందుకోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందులో మహిళాహక్కుల కార్యకర్తలు, హోం, కార్మిక, మహిళా సంక్షేమ శాఖలతోపాటు సినీ పరిశ్రమకు చెందినవారికి స్థానం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top