తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు కావాలని, ప్రస్తుత హైకోర్టును విభజించాలని సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఐదు రోజులకే కె.చంద్రశేఖర్రావు ...
- విభజన కోరుతూ సీఎం కేసీఆర్ ఎప్పుడో లేఖ రాశారు: కేటీఆర్
- కేంద్రం కోరితే మరో లేఖ రాయడానికీ సంసిద్ధం
- రాష్ట్రాన్ని సాధించిన వారికి ప్రత్యేక హైకోర్టు సాధన కష్టం కాదు
- తెలంగాణ న్యాయవాదులు ఆందోళన విరమించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు కావాలని, ప్రస్తుత హైకోర్టును విభజించాలని సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఐదు రోజులకే కె.చంద్రశేఖర్రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. అంతేకాక ప్రధాని నరేంద్ర మోదీ ని కలసిన మూడు సందర్భాల్లోనూ హైకోర్టును విభజించాలని కేసీఆర్ కోరారని చెప్పారు.
తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ రెండు, మూడు నెలల్లో తెలంగాణకు ప్రత్యేకహైకోర్టును ఏర్పాటు చేస్తామని, కాకుంటే తెలంగాణ సీఎం లేఖ రాయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ్ పేర్కొన్నారని, మరోసారి కూడా లేఖ రాయడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లకూ విజ్ఞప్తి చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ప్రస్తుత భవన సముదాయంలో లేదంటే కొత్త భవనాల్లో ఏర్పాటు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి హైదరాబాద్లో భవనాలను కూడా పరిశీలించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారికి ప్రత్యేక హైకోర్టును సాధించడం పెద్ద కష్టంకాదని, తెలంగాణ న్యాయవాదులు ఆందోళన విరమించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారన్నారు.
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారు
తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగి స్తున్న చంద్రబాబును పక్కన పెట్టుకుని బీజేపీ నేతలు ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఉద్యమ నేతగా ఉన్న దేవీప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించకపోగా కుసంస్కారంతో పోటీ చేశారని విమర్శించారు. కోట్లు గుమ్మరించైనా దేవీప్రసాద్ను ఓడగొట్టాలని చంద్రబాబు కుట్రలకు తెరలేపాడని, బాబుకుట్రలను భగ్నం చేయాలని పట్టభద్రులను కోరారు.