జూన్‌ 1లోగా నరేష్‌ను కోర్టులో హాజరుపరచండి | High court directs police to find out missing man naresh | Sakshi
Sakshi News home page

స్వాతిని ఒంటరిగా ఎలా వదిలేశారు..?

May 18 2017 12:57 PM | Updated on Aug 31 2018 8:34 PM

జూన్‌ 1లోగా నరేష్‌ను కోర్టులో హాజరుపరచండి - Sakshi

జూన్‌ 1లోగా నరేష్‌ను కోర్టులో హాజరుపరచండి

యాదాద్రి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్‌ అదృశ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

హైదరాబాద్‌ :  యాదాద్రి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్‌ అదృశ్యంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.  ప్రేమించి పెండ్లి చేసుకున్న తన కుమారుడు కనిపించడం లేదని, అతని ఆచూకీ కనిపెట్టాలంటూ నరేష్‌ తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ దాఖలు చేయగా, దానిపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది.

జూన్‌1లోగా నరేష్‌ జాడ కనిపెట్టి కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం ఈ సందర్భంగా డీజీపీని ఆదేశించింది. లేదంటే ఉన్నతాధికారితో విచారణ జరపించి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచన చేసింది. అలాగే అతడిని వెతికే బాధ్యతను ప్రత్యేక అధికారికి అప్పగించాలని సూచించింది.

రెండురోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని కూడా అన్ని కోణాల్లో విచారించారా అని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిన స్వాతిని ఆమె తండ్రి ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టారని ప్రశ్నలు సంధించింది. దీనిపై ప్రభుత్వ లాయర్‌ శరత్‌ సమాధానమిస్తూ... నరేష్‌ అదృశ్యం వెనుక స్వాతి తండ్రి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు ఈ కేసుపై భువనగిరి డీసీపీ యాదగిరి మాట్లాడుతూ... పోస్ట్‌మార్టం నివేదికలో స్వాతిది ఆత్మహత్యగానే తేలిందన్నారు. వరకట్న వేధింపుల వల్లే స్వాతి తమ ఇంటికి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారని, అలాగే నరేష్‌ ఆచూకీ ఇంకా తెలియలేదన్నారు. స్వాతి తండ్రిని కూడా విచారిస్తున్నామని, త్వరలోనే కేసును ఛేదిస్తామని డీజీపీ తెలిపారు.

మృతురాలు స్వాతికి మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన అంబోజు నరేష్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా రెండు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. నరేష్‌ తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నారు. నరేష్‌ పల్లెర్లలో తాత వద్ద ఉంటూ భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. స్వాతి వలిగొండలో ప్రగతి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫేస్‌బుక్‌లో ఏర్పడిన ఈ ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత మార్చి 25న ముంబై వెళ్లి వివాహం చేసుకున్నారు.

నెల రోజుల క్రితం అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇరువురిని ముంబై నుంచి పిలిపించారు. కుటుంబాల మధ్య గొడవలు వద్దు, మంచిగా ఉండాలని వారికి సూచించారు. దాంతో నరేష్‌–స్వాతి తిరిగి ముంబైకి వెళ్లారు. 15 రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిపిస్తానంటూ.. స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చెప్పడంతో ఈనెల 11న తిరిగి భువనగిరికి వచ్చారు. అక్కడే ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తన కూతురును తీసుకెళ్లారు. అప్పటి నుంచి నరేష్‌ కనిపించడం లేదు. ఈ విషయంపై నరేష్‌ తండ్రి అంబోజు వెంకటయ్య హోంమంత్రి, డీసీపీలకు ఫిర్యాదు చేయడమే కాకుండా హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement