బహ్రెయిన్‌లో ఆపద్బాంధవులు | Helping nature men in Bahrein | Sakshi
Sakshi News home page

బహ్రెయిన్‌లో ఆపద్బాంధవులు

Mar 19 2018 12:53 PM | Updated on Apr 6 2019 8:52 PM

Helping nature men in Bahrein - Sakshi

ఆర్థిక సాయం చేస్తున్న సతీశ్‌.. సంస్ధ సభ్యులు 

రాయికల్‌(జగిత్యాల): ఉన్న ఉరిలో ఉపాధి కరువవడంతో బహ్రెయిన్‌ దేశంకు వెళ్లిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కార్మికులు పడుతున్న కష్టాలను చూసి చలించి పోయిన జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండకు చెందిన రాధారపు సతీశ్‌కుమార్‌ 2012లో 25మంది సభ్యులతో కలిసి ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో జగిత్యాల జిల్లాకు చెందిన ఊట్‌పెల్లికి చెందిన బొలిశెట్టి వెంకటేష్, మెట్‌పెల్లికి చెందిన లింబాద్రి, వేంపేట్‌కు చెందిన మగ్గిడి రాజేందర్‌తోపాటు వివిధ జిల్లాకు చెందిన సభ్యులతో కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. బహ్రెయిన్‌లోని వివిధ కంపెనీ ల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు ఏదైన ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన, మృతిచెందిన వారందిరికీ అండదండగా ఉంటూ ఆపద సమయంలో మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. క్షతగాత్రులకు కుటుంబసభ్యుల్లా సేవలందిస్తున్నారు. 

మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు
బహ్రెయిన్‌లో ఉపాధి పొందుతూ మృతిచెందిన వారి కుటుంబసభ్యులను ఆదుకోవడానికి ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ సభ్యులంతా కలిసి తమకు వచ్చిన జీతంలో కొంత డబ్బును జమ చేస్తున్నారు. మల్లాపూర్‌ మండలం సాతారంకు చెందిన కొమ్మ శంకర్, కామరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన బట్టు సేవ్య, గాం«ధారి మండలం కొడంగల్‌కు మారుకంటి బాబు, నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం రామన్నపేటకి చెందిన సాయన్న, కరీంనగర్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవనగర్‌కి చెందిన రాజన్న, నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం మెండోరకి చెందిన అల్లెపు గంగారం ఇటీవల బహ్రెయిన్‌లో మృతిచెందగా వారి మృతదేహాలను సొంతఖర్చులతో స్వగ్రామాలకు పంపించారు.

మెట్‌పెల్లి మండలం రంగరావుపేటకు చెందిన గుగ్లావత్‌ రాజేందర్‌ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి పోగా మందుల ఖర్చులు, నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం రామన్నపేటకు చెందిన సాయన్నకు పక్షవాతం రావడంతో, ఖానాపూర్‌ మండలానికి చెందిన బైరగొని సంజీవ్‌ కడుపులో కణితి పెరగడంతో  వారు స్వగ్రామానికి వెళ్లేలా విమాన ఛార్జీలు అందజేశారు. అంతే కాకుండా కరీంనగర్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌కు చెందిన రాజన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ. 20వేలు అందజేశారు. వీరి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్, ఎంపీ కవిత అభినందించారు.

సేవ.. సంతృప్తినిస్తుంది
నిరక్షరాస్యులైన కార్మికులు ఏజెంట్ల మాయమాటలు నమ్మి బెహరాన్‌ దేశంకు వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వారిని ఆదుకోవడంతోపాటు, తోచిన సాయం చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన 25మంది సభ్యులతో కలిసి ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. తద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం.
– రాధారపు సతీశ్‌కుమార్‌ 

Advertisement
 
Advertisement
Advertisement