పండుగపూట తడిసి ముద్దయిన నగరం | Heavy Rain Interrupted Bathukamma Celebrations In Hyderabad | Sakshi
Sakshi News home page

పండుగపూట తడిసి ముద్దయిన నగరం

Oct 7 2019 3:37 AM | Updated on Oct 7 2019 9:23 AM

Heavy Rain Interrupted Bathukamma Celebrations In Hyderabad - Sakshi

ఆదివారం కురిసిన వర్షానికి జలమయమైన కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలోని రోడ్డు

బతుకమ్మ ఉత్సవాలకు అనేకచోట్ల ఆటంకం కలిగింది. ఈ వర్షాల కారణంగా పలు పంటలపై వ్యతిరేక ప్రభా వం చూపే పరిస్థితి కనిపిస్తుంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు వీడటంలేదు. వరుస వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో బతుకమ్మ ఉత్సవాలకు అనేకచోట్ల ఆటంకం కలిగింది. ఈ వర్షాల కారణంగా పలు పంటలపై వ్యతిరేక ప్రభా వం చూపే పరిస్థితి కనిపిస్తుంది. పత్తి కాయ పగిలే దశలో ఉన్నందున నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. 

ఇంటీరియర్‌ ఒడిశ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో సోమవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఒకట్రెండుచోట్ల భారీవర్షాలతోపాటు, చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు.  

నగరంలో 10 సెంటీమీటర్ల వర్షం 
రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం వరుస వర్షాలతో నిండా మునుగుతోంది. ఆదివారం క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మధ్యా హ్నం నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మండ లం రాజీవ్‌గృహకల్ప, జగద్గిరిగుట్ట ప్రాంతా ల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుతు్బల్లాపూర్‌ మండలం గాజులరామారం, ఉషోదయపార్కు వద్ద 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక షాపూర్‌నగర్‌లో 8.5, సుభాష్‌నగర్, ఆలి్వ న్‌ కాలనీలలో 7, అంబర్‌పేట, రామంతాపూర్‌లలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. 

దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోని వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై ఉన్న భారీ వృక్షాలు కుప్పకూలడంతో వాటి కింద పార్కింగ్‌ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీల వాసులు నానా అవస్థలు పడ్డారు. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. పలు నాలాలు ఉగ్రరూపం దాల్చడంతో వాటికి ఆనుకుని ఉన్న బస్తీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.    

ఇంట్లోకి చేరిన నీటిలో మునిగి వ్యక్తి మృతి 
బొల్లారం: తిరుమలగిరిలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం ఓ వ్యక్తి ప్రాణాలను హరించింది. ఇక్కడి శాస్త్రీనగర్‌లోని నాలా ఉప్పొంగి దానికి ఆనుకొని ఉన్న ఇంట్లోకి ప్రవహించడంతో నిద్రలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం మేరకు శాస్త్రీనగర్‌కు చెందిన జగదీశ్‌(35), తల్లితో కలిసి గత రెండేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తల్లి బాయమ్మ స్థానిక చర్చితో పాటు పలు చర్చిల వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం జగదీశ్‌ ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇదే సమయంలో భారీగా వర్షం కురవడంతో అతని ఇల్లు కూడా నాలా వెంట ఉండడంతో వరద నీళ్లు ఉప్పొంగి వారి ఇంట్లోకి ప్రవేశించాయి. 

గాఢ నిద్రలో ఉన్న జగదీశ్‌ ఈ విషయం తెల్సుకునేలోపే ఊపిరందనిస్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోయాడు. వర్షం తగ్గిన తరువాత ఇంట్లోని గడప వద్ద పడివున్న జగదీశ్‌ మృతదేహాన్ని స్థానికులు గమనించి తల్లికి విషయాన్ని చేరవేశారు.విగతజీవుడిగా ఉన్న కుమారుడిని చూసి తల్లి కుప్పకూలింది. కాగా అతనికి మూర్ఛవ్యాధి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బస్తీవాసులతో పాటు బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ, టీఆర్‌ఎస్‌ ఏడోవార్డు అధ్యక్షుడు కేబీశంకర్‌రావు ఆర్థిక సాయం చేయడంతో జగదీశ్‌కు అంత్యక్రియలు జరిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement