నన్ను క్షమించండి.. మిమ్మల్ని కలవలేకపోతున్నా
కరోనా నేపథ్యంలో నా పుట్టినరోజు వేడుకలు వద్దు
ప్రజలకు, అభిమానులకు మంత్రి హరీశ్ విజ్ఞప్తి
సిద్దిపేట జోన్: తనను క్షమించాలంటూ ప్రజలకు, అభిమానులకు, పార్టీ శ్రేణులకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో నేడు (జూన్ 3) మంత్రి హరీశ్ పుట్టిన రోజు సందర్భంగా ఎవరినీ కలవలేకపోతుండటంపై మన్నించాలంటూ ఆయన పేర్కొన్నారు. ‘నా పుట్టినరోజు సందర్భంగా నన్ను కలవడానికి వస్తామంటూ వేలాది మంది అభిమానులు ఫోన్లు చేస్తున్నారు. మీ అభిమానానికి ధన్యున్ని. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నా విజ్ఞప్తిని మంచి మనసుతో స్వీకరించండి.
మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు నన్ను మన్నించండి. ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, మిమ్మల్ని కలవడం, మీకు నాకు శ్రేయస్కరం కాదు. కరోనా వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు జరపవద్దు. నన్ను కలవడానికి రావద్దు.. నా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నాను’అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, భౌతిక దూరం పాటించాలని జన సమూహానికి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.