రేపటి నుంచి హజ్‌ క్యాంప్‌ షురూ.. | Haj Camp Shuru from tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి హజ్‌ క్యాంప్‌ షురూ..

Jul 29 2018 2:15 AM | Updated on Jul 29 2018 2:15 AM

Haj Camp Shuru from tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హజ్‌ యాత్ర–2018కి సంబంధించిన హజ్‌ క్యాంప్‌ సోమవారం(30న) నుంచి ప్రారం భం కానుంది. ఈ ఏడాది హజ్‌ క్యాంప్‌ నుంచి తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని 4 జిల్లాల నుంచి దాదాపు 8 వేల మంది హజ్‌ యాత్రికులు యాత్రకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హజ్‌ కమిటీ హజ్‌ హౌస్‌లో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఆగస్టు 1 నుంచి హజ్‌ యాత్ర 2018 ప్రారంభం కానుంది. హజ్‌ హౌస్‌ను మిని ఎయిర్‌పోర్టుగా మార్చడానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించనున్నారు.

యాత్ర కు సంబంధించిన లగేజ్, బోర్డింగ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ తదితర అన్ని ప్రక్రియల కౌంటర్లను హజ్‌ హౌస్‌లోనే ఏర్పాటు చేయనున్నారు. యాత్రికులు హజ్‌ హౌస్‌ నుంచి ఆర్టీసీ బస్సుల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని హజ్‌ టెర్మినల్‌ చేరుకుం టా రని హజ్‌ కమిటీ చైర్మన్‌ మసీవుల్లా ఖాన్‌ తెలిపారు. అనంతరం విమానంలో సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి మక్కాకు చేరుకుంటారన్నారు.

జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, రవా ణా, అగ్నిమాపక, పోలీసు శాఖల సమన్వయంతో యాత్రికులకు అసౌకర్యం కలగకుండా హజ్‌ క్యాంప్‌ కొనసాగుతుందని హజ్‌ కమిటీ ప్రత్యేకాధికారి తెలిపారు. సోమవారం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హజ్‌ హౌస్‌లో తమ సిబ్బందితో సమీక్ష జరిపి, వారికి షిఫ్టులను కేటాయిస్తారన్నారు. యాత్ర కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు హజ్‌ హౌస్‌లోనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

విడుదల కాని నిధులు..
హజ్‌ క్యాంప్‌ నిర్వహణకు అవసరమైన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఈ ఏడాది హజ్‌ క్యాంప్‌తో పాటు హజ్‌ కమిటీకి ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది రావాల్సిన మొదటి క్వార్టర్‌ నిధులు ఇంకా విడుదల కాలేదు. హజ్‌ క్యాంప్‌ నిర్వహణకు టెండర్ల ద్వారా పనులు కేటాయించారు. టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అడ్వాన్స్‌లివ్వాలని హజ్‌ కమిటీ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో హజ్‌ క్యాంప్‌ నిర్వహణపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement