చస్తే యాభై వేలు వస్తుందిలే..! | govt hospital, child dead, physician negligence | Sakshi
Sakshi News home page

చస్తే యాభై వేలు వస్తుందిలే..!

Feb 7 2017 2:26 AM | Updated on Sep 5 2017 3:03 AM

స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా ఓ పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయింది.

మచిలీపట్నంలో ప్రభుత్వ డాక్టర్‌ నిర్లక్ష్యానికి చిన్నారి బలి
మచిలీపట్నం టౌన్‌(మచిలీపట్నం): స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా ఓ పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పాము కాటేసిం దని తీసుకెళ్తే.. పుల్లలు గుచ్చుకుని ఉంటా యని వైద్యం అక్కర్లేదంటూ ఇంటికి పంపించడంతో ఆ చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీప ట్నం మండలం నెలకుర్రుకి చెందిన పుట్టి రవి, ధనలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సుశాంత్‌(6)ను ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా పాము కాటేసింది. గుర్తించిన తల్లిదండ్రులు బాలుడ్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

డ్యూటీలో ఉన్న గైనకాలజిస్టు డాక్టర్‌ నీలిమ... ఇది పాము కాటు కాదని, బాలుడికి పుల్లలు గుచ్చుకుని ఉంటాయని, వైద్యం అక్కర్లే దని చెప్పి పంపించేశారు. తమ బాబును పాము కరిచింది నిజమేనంటూ తల్లిదండ్రులు మొరపెట్టుకున్నా నీలిమ పట్టించుకో లేదు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. తెల్లారేసరికి కాలు వాచి, తీవ్ర నొప్పితో సుశాంత్‌ విలవిలలాడుతుండటంతో తల్లిదండ్రులు సోమవారం మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పుడూ డ్యూటీలో ఉన్న డాక్టర్‌ నీలిమ.. పిల్లాడు పోతే రూ.50 వేలు వస్తుందిలే అంటూ వ్యంగ్యంగా మాట్లాడి వైద్యం చేయలేదు. ఇంతలో చిన్నారి మృతిచెందాడు. సమయానికి వైద్యం అందిస్తే తమ బాబు తమకు దక్కేవాడని తల్లిదండ్రులు విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement