
భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందేలా నిరంతరం పర్యవేక్షిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆ ఆస్పత్రులపై నమ్మకం పెరిగేలా అడుగు ముందుకేశారు. ఆయన భార్య శ్రద్ధ గర్భం దాల్చినప్పటి నుంచి పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేరి్పంచగా సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్ నేతృత్వాన వైద్యులు సరళ, అనూష, హెడ్ నర్సు రేవతి బుధవారం ఉదయం 10.03 గంటలకు ఆపరేషన్ ద్వారా కాన్పు చేశారు.
కలెక్టర్ దంపతులకు ఇప్పటికే కుమారుడు ఉండగా, రెండో కాన్పులోనూ పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా ఆస్పత్రికి చేరుకున్న కలెక్టర్ తన కుమారుడిని ఎత్తుకుని మురిసిపోవడమే కాక వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉన్నందున ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని సూచించారు.
అభినందనలు తెలిపిన మంత్రులు
కలెక్టర్ జితేష్ పాటిల్ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్విట్టర్లో ఆయనను ప్రశంసించారు. ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కుటుంబీకులకు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.