తక్కువ మార్కులు వచ్చాయని... ఆత్మహత్య | Girl student commits suicide worried about low marks in Tenth exams | Sakshi
Sakshi News home page

తక్కువ మార్కులు వచ్చాయని... ఆత్మహత్య

Mar 11 2015 10:45 PM | Updated on Sep 2 2017 10:40 PM

గణితంలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపానికి గురైన ఓ పదో తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గన్నవరం (హైదరాబాద్) : గణితంలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపానికి గురైన ఓ పదో తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని దావాజిగూడెం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం జరిగింది. ఆగిరిపల్లి మండలం కౌతవరప్పాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు మట్టా కృష్ణారావు, కృష్ణవేణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆర్థికలేమి కారణంగా పెద్ద కుమార్తె సురేఖ (15), రెండో కుమార్తె ప్రియాంక(13)లను దావాజిగూడెంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో చేర్చారు. హాస్టల్ సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సురేఖ పదో తరగతి, ప్రియాంక తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పాఠశాలలో జరిగిన ప్రీ-పబ్లిక్ పరీక్షల్లో గణితంలో సురేఖకు 50 మార్కులకు గాను ఏడు మార్కులు మాత్రమే వచ్చాయి.

తక్కువ మార్కులు వచ్చిన మిగిలిన విద్యార్థులతో పాటు సురేఖను కూడా ఉపాధ్యాయులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన సురేఖ మధ్యాహ్నం స్నేహితురాలితో పాటు హాస్టల్‌కు వెళ్లి అనారోగ్యంగా ఉందనే కారణంతో తిరిగి పాఠశాలకు వెళ్లలేదు. కొద్దిసేపటి తర్వాత గణితం-2 పరీక్షకు రాకపోవడంతో ఉపాధ్యాయులు సురేఖను తీసుకువచ్చేందుకు ఆమె సోదరి ప్రియాంకను హాస్టల్‌కు పంపించారు. ఆమె గది తలుపు వేసి ఉండడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది స్థానికుల సహకారంతో తలుపులు బలవంతంగా తెరిచి చూడగా సురేఖ గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఉంది. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న సీఐ అహ్మద్ అలీ, ఎసై్స సత్యశ్రీనివాస్ అక్కడికి చేరుకుని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

పోల్

Advertisement