బద్దం బాల్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు 

Final farewell to the Baddam Balreddy - Sakshi

హైదరాబాద్‌: అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య బీజేపీ సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో నిర్వహించారు. శాస్త్రయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం అనంతరం చితికి ఆయన పెద్ద కుమారుడు నిప్పంటించారు. బద్దం బాల్‌రెడ్డి అంతిమయాత్ర బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి, అక్కడి నుంచి మెహిదీపట్నం, టోలిచౌకి, షేక్‌పేట్, రాయదుర్గం మీదుగా వైకుంఠ మహాప్రస్థానం వరకు కొనసాగింది. వేలాదిగా విచ్చేసిన జనం ఆయన కడసారి చూపు కోసం తెల్లవారుజాము నుంచే ఇంటి వద్ద బారులు తీరారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ హోం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జానారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు ఎంవి.మైసూరారెడ్డి, డీకే సమరసింహారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, నాయకులు ఎగ్గె మల్లెశం, ఎంఎస్‌ ప్రభాకర్‌ తదితరులు బద్దం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top