కరోనా : మొన్న తండ్రి.. నిన్న కొడుకు | Father And Son Deceased In Same Family Due To Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా : మొన్న తండ్రి.. నిన్న కొడుకు

May 3 2020 7:21 AM | Updated on May 3 2020 3:51 PM

Father And Son Deceased In Same Family Due To Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రెండు రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలో తండ్రీ కొడుకులిద్దరు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే...మలక్‌పేట గంజ్‌లో నూనె వ్యాపారం చేసే వ్యక్తి అస్వస్థతకు గురై వనస్థలిపురంలోని ఓ ఆసుపత్రిలో ఇటీవల చికిత్స పొందగా అతని ద్వారా వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో నివాసం ఉండే తండ్రి (76), తమ్ముడు (45), ఇతర కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచి్చన సంగతి తెలిసిందే. కాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తండ్రి మృతిచెందగా, శుక్రవారం కుమారుడు (గంజ్‌ వ్యాపారి తమ్ముడు) కూడా మృతి చెందాడు. వీరి కుంటుంబానికి చెందిన మరో నలుగురు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక గంజ్‌ వ్యాపారి ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతని భార్య, కుమారునికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలడం, అలాగే బీఎన్‌రెడ్డినగర్‌ ఎస్‌కేడీనగర్‌లో నివాసం ఉండే మరో కుటుబంలోని ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో మూడు కుటుంబాలకు చెందిన బంధువులు అందరు గాంధీ ఆసుపత్రిలోనే  ఉన్నారు. దీంతో  మృతుల అంత్యక్రియల ను మున్సిపల్‌ అధికారులే నిర్వహించాల్సి వస్తోంది. (పాక్, రష్యాల్లో కరోనా విజృంభణ)

వనస్థలిపురంలో అధికారుల పర్యటన... 
వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో ఒకే ఇంటిలో ఇద్దరు కరోనాతో మృతి చెందడం, అదే కుటుంబానికి చెందిన మరో నలుగురు గాంధీ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో శనివారం వనస్థలిపురంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ప్రదీప్‌కుమార్, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి తదితర అధికారులు పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కంటైన్మెంట్‌ జోన్‌లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.  

ఎల్‌బీనగర్‌ జోన్‌లో మరో నాలుగు కేసులు... 
హయత్‌నగర్‌ సర్కిల్‌ బీఎన్‌రెడ్డినగర్‌ ఎస్‌కేడీ నగర్‌లో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు, లింగోజిగూడ డివిజన్‌ భాగ్యనగర్‌ కాలనీలో నివసించే యువకునికి కరోనా పాజిటివ్‌ వచి్చంది. సరూర్‌నగర్‌లో డయాలసిస్‌ ఉన్నవ్యక్తి మరో కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎల్‌బీనగర్‌లో 16 కేసులు నమోదయ్యాయి. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌–3లో 2, సర్కిల్‌–4లో 9, సర్కిల్‌–5లో 5 కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement