కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. చల్గల్ గ్రామానికి చెందిన కోల నాగయ్య(48) తనకున్న తన భూమితో పాటు రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. పైరు గింజ దశకు చేరుకున్న సమయంలో నీరు అడుగంటడంతో పొలం ఎండిపోయింది. పెట్టుబడులు, పిల్లల పెళ్లిళ్ల కోసం రూ.5 లక్షల దాకా అప్పు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. బుధవారం రాత్రి పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇదే మండలం బాలెపల్లిలో బేతి సుధాకర్రెడ్డి(40) నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల భూగర్భ జలాలు అడుగంటాయి. కళ్లముందే పంట ఎండిపోతుండడంతో మనస్తాపం చెందాడు. ఇతనికి రూ.10 లక్షల వరకు అప్పు ఉంది. ఎలా తీర్చాలనే బెంగతో బుధవారం రాత్రి మొక్కజొన్న చేను వద్ద పురుగు మందు తాగి ప్రాణం విడిచాడు. ఇతనికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.