మూగబోనున్న ‘మైకు’

Election Campaign Is Over Today - Sakshi

 నేటితో ప్రచారం ముగింపు

నేడు ప్రధాన అభ్యర్థుల భారీ ర్యాలీలు

ప్రలోభాలకు లేచిన తెర మద్యం, మనీ పంపకాలకు ఏర్పాట్లు

బూత్‌ల వారీగా  పంపిణీకి ఇన్‌చార్జీలు

కట్టలు తెంచుకుంటున్న నోట్ల కట్టలు

మంచిర్యాలలోనే  రెండు రోజుల్లో రూ.71.50 లక్షల పట్టివేత  

ఉమ్మడి జిల్లాలో పెరిగిన పోలీస్‌ నిఘా

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌:
గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారాలతో అట్టుడికిన పల్లెలు, పట్టణాలు మరికొద్ది గంటల్లో పూర్వపు స్థితికి చేరనున్నాయి. ఈనెల 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుండడంతో బుధవారం సాయంత్రంతో మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు అన్ని పార్టీలు ప్రచారాలు బంద్‌ చేయాల్సిందే. ఇక మిగిలిన కొద్ది గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రణా ళికలు సిద్ధం చేసుకున్నారు.
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, సభలకు ఏర్పాట్లు చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్‌పీ తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు తుది ప్రచారాన్ని అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన పార్టీల ముఖ్య నాయకులెవరూ ప్రచారానికి వచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ... అందుబాటులో ఉన్న నేతలతోనే అభ్యర్థులు ఉనికిని చాటేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారానికి తెరపడనుంది. 

ప్రలోభాలకు లేచిన తెర
నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి బూత్‌ల వారీగా నియమితులైన నాయకులు, స్థానిక పెద్దలు ఇప్పటికే ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాల్లో మునిగిపోయారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్‌ జరిగే 7వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని వచ్చిన ఆదేశాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ‘సరుకు’ను రహస్య ప్రదేశాలకు తరలించారు. మండల కేంద్రాలు, పట్టణాల నుంచి మద్యం సీసాలు బూత్‌ల వారీగా తరలిపోయాయి.
బుధవారం రాత్రి నుంచి పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు రెబల్స్‌గా పోటీ చేస్తున్న ముఖ్య నాయకులు ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. బూత్‌ల వారీగా పర్యవేక్షణకు సంబంధించి అన్ని పార్టీలు డబ్బుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేశాయి. 

అప్రమత్తమైన అధికార యంత్రాంగం
పోలింగ్‌కు మరో రెండ్రోజులే గడువు మిగిలి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, సహాయ, రిటర్నింగ్‌ అధికారులు పోలింగ్‌ ప్రక్రియకు çఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రచారం ముగిసిన వెంటనే పోలింగ్‌ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకొని అధికారులకు అప్పజెప్పనున్నారు.
ప్రతి పోలింగ్‌ బూత్‌కు అవసరమైన అధికారుల నియామకాలు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో వెబ్‌కాస్టింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ సాయంత్రం 4గంటల వరకే కొనసాగనున్నందున మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎన్నికల పరిశీలకులు, మైక్రో అబ్జర్వర్లతో పాటు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నియమించిన అధికారులు ఇప్పటికే విధుల్లో బిజీగా ఉన్నారు. 

పెరిగిన పోలీస్‌ నిఘా..
ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీని అడ్డుకునేందుకు పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఎస్పీలతో పాటు మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఇందుకోసం పనిచేస్తున్నాయి. బస్తీలు, గ్రామాల్లో నగదు, మద్యం పంపిణీకి సం బంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించేలా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే పోలీస్‌ యంత్రాంగం ఈ పనిలో తలమునకలైంది.
బెల్లంపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి సంబంధించి తరలిస్తున్న రూ.50 లక్షల నగదును సోమవారం రాత్రి మంచిర్యాల పట్టణ సీఐ ఎడ్ల మహేష్‌ సీజ్‌ చేయగా, అంతకు ముందు బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో పరిధిలో ఓ పార్టీకి చెందిన వ్యక్తి నుంచి రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే మరో రూ.20 లక్షలు కూడా పట్టుబడ్డాయి. ఇప్పటికే మద్యం పంపిణీ చేస్తున్న 8మందిపై కేసు నమోదు చేసి 575 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు రోజులు రాత్రి పగలు తేడా లేకుండా నిఘా కొనసాగుతుందని ఆదిలాబాద్‌కు చెందని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. మద్యం, మనీ పంపిణీలో ఏ పార్టీని, అభ్యర్థిని ఉపేక్షించవద్దని కచ్చితమైన ఆదేశాలు ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top