వాగు.. వంక ఎండిపోయే.. | Dry the streams.. drought Booming in the district | Sakshi
Sakshi News home page

వాగు.. వంక ఎండిపోయే..

Mar 7 2017 6:39 PM | Updated on Jun 4 2019 5:16 PM

గ్రామాల్లో ఉండే వాగులు, వంకలు అప్పుడే ఎండిపోయాయి. పశువులకు తాగునీరు లేక ఆయా గ్రామాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

► గ్రామాల్లో అలుముకున్న కరువుఛాయలు
► పశువుల తాగునీటికి తప్పని తిప్పలు
► ఎండిన పంటలు.. ఆందోళనలో రైతన్నలు
 
రాజోళి : గ్రామాల్లో ఉండే వాగులు, వంకలు అప్పుడే ఎండిపోయాయి. ఒకప్పుడు పశువులకు తాగునీరు అందించి, పశుగ్రాసం పండేందుకు అనుకూలంగా ఉన్న ఆయా గ్రామాల వాగులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. మండల కేంద్రమైన రాజోళితోపాటు మాన్‌దొడ్డి, పచ్చర్ల తదిదర గ్రామాల వాగులు గతంలో వేసవి కాలం లోనూ పశువులకు నీరందించడమే కాక, గ్రామ ప్రజలకు ఆయా అవసరాలు తీర్చేవి. ప్రస్తుతం ఆ వాగులన్నీ పూర్తిగా ఎండిపోవడంతో గ్రామాల్లో పశువులకు తాగునీరు దొరకక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఎండిపోయిన పంటలు: ఆయా వాగుల ద్వారా ప్రతి సంవత్సరం పంటలు పండించేవారు. ఈసారి కూడా ఎప్పటిలాగే వరి సాగుచేసినప్పటికీ సరైన వర్షాలు లేక, ఆర్డీఎస్‌కు నీరు రాక గ్రామాల్లోని వాగులన్నీ ఎండిపోయా యి. ఆ వాగుల కింద సాగుచేసిన పంటలు కూడా ఏమాత్రం చేతికి రాలేదు. దీంతో పశువులకు గ్రాసం కూడా కరువై పాడి రైతులు పశువులను అమ్ముకునే పరిస్థితి ఎదురైంది.
 
పెద్దవాగులకే దిక్కులేదు: మండలంలో ఇప్పటికే కరువుఛాయలు అలుముకున్నాయి. రాజోళి, మాన్‌దొడ్డిలో పెద్ద వాగులుగా పేరున్నాయి. మాన్‌దొడ్డి వాగు కింద నీటి లభ్యత ఉన్న సమయంలో వరి పంటతో పాటు ఇతర పశుగ్రాసం, మరికొందరు కూరగాయలు సాగు చేసుకునేవారు. ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొంది. వాగు మొత్తం ఎండిపోయి ఎడారిని తలపిస్తుంది. ఈ వాగులు ఎండిపోవడంతో అటు పశువులకు తాగునీరు, గ్రాసం కూడా దొరకడం లేదు. వీటితోపాటు గ్రామంలోని రజకులు దుస్తులు ఉతకడానికి, ఇతర అవసరాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement