డ్రోన్ కెమెరాలపై నిషేధం
భద్రతా కారణాల రీత్యా.. సీపీ కార్తికేయ ప్రకటన
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ప్రజల భద్రత దృష్ట్యా జిల్లాలో డ్రోన్ కెమెరాలు నిషేధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ కార్తికేయ గురువారం ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా మన దేశంలోని పంజాబ్ ప్రాంతంలో ఆయుధాలను జార విడిచినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావొద్దని సీపీ సూచించారు. భద్రతా చర్యల రీత్యా పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాల వాడకం నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా డ్రోన్ కెమెరాలు వాడితే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ఓ ప్రకటనలో హెచ్చరించారు. డ్రోన్లు వాడుతున్నట్లు సమాచారముంటే 100, పీసీఆర్ కంట్రోల్ రూం (08462– 226090) స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూం (94906 18000) కు కాల్ చేసి చెప్పాలని సూచించారు. లేదా ఫోన్ నెం. 94906 18029, 94913 98540లకు వాట్సాప్ ద్వారా సమాచారమివ్వాలని సీపీ కార్తికేయ కోరారు.