మనసు పలికే మధుర భావన | Doctor Couple Love marriage Special Story Khammam | Sakshi
Sakshi News home page

మనసు పలికే మధుర భావన

Feb 14 2020 12:07 PM | Updated on Feb 14 2020 12:07 PM

Doctor Couple Love marriage Special Story Khammam - Sakshi

పిల్లలతో డాక్టర్‌ మురళీకృష్ణారెడ్డి, మేఘనా చౌదరి దంపతులు

ప్రేమ అనేది ఓ మధుర భావన. యువత ఆ ధ్యాసలో పడి.. పరిణతి చెందకుండానే తొందర పడి.. జీవితాలను కోల్పోవద్దని, స్థిరపడ్డాక తల్లిండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని.. అప్పుడే దాంపత్యం అన్యోన్యంగా సాగుతుందని పలువురు చెబుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా(ఫిబ్రవరి 14) ఒకరిద్దరి అభిప్రాయాలు...

మధిర: ప్రేమించడం తప్పుకాదు కానీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరిన తరాత్వ ప్రేమించినవారిని పెళ్లి చేసుకోవాలని అంటున్నారు  హై కేర్‌ ఆస్పత్రి వైద్యులు మురళీకృష్ణారెడ్డి, మేఘనా చౌదరి దంపతులు. మురళీకృష్ణారెడ్డి,  మేఘనా చౌదరిలకు 2008లో  కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అప్పుడు అతను ఎంబీబీఎస్‌ చేస్తుండగా, ఆమె బీటెక్‌ చదువుతోంది. జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకోవాలన్నారు. అతను ఎంఎస్, ఆమె ఎంబీఏ పూర్తి చేశారు.  2016లో ఇరువైపులా కుటుంబ సభ్యులను ఒప్పించి, అందరి మన్ననలతో వివాహం చేసుకున్నారు. వారి అనురాగ బంధానికి ప్రతీకగా కుమార్తె రాగ, కుమారుడు అర్జున్‌ జన్మించారు. ఇద్దరు పిల్లలతో అన్యోన్య దాంపత్యం కొనసాగిస్తున్నారు. ప్రేమికుల రోజూ సందర్భంగా వారు మాట్లాడుతూ..‘ ప్రేమించినా  తొందరపడి, జీవితంలో స్థిరపడకుండా, పరిణతి చెందకుండా వివాహం చేసుకుంటే అనేక కష్టాలు ఎదురవుతాయి. బంధువులు, స్నేహితులు కూడా దూరమవుతారు. అలా కాకుండా జీవితంలో నిలదొక్కుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లిచేసుకుంటే సంతోషంగా ఉంటుంది. ప్రతి ప్రయాణం మొదలయ్యేది స్నేహంతోనే. మాది అలాగే మొదలై ఎన్నో ఒడిదుడుకులతో పెళ్లి అనే గమ్యానికిచేరడానికి 10 సంవత్సరాలు పట్టింది.’ అని పేర్కొన్నారు.

పిల్లలతో శ్రీనివాసరావు, ప్రశాంతి దంపతులు
జీవితం నష్టపోవద్దు
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలం రామాపురం గ్రామానికి చెందిన కొమ్మూరి శ్రీనివాసరావు మధిరలో డిగ్రీ చదువుతున్నాడు.  ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా రాయనపాడు గ్రామానికి చెందిన తాతినేని ప్రశాంతి విజయవాడలో బీఎస్సీ చదువుతోంది. శ్రీనివాసరావుకు తన  స్నేహితుడి ద్వారా ప్రశాంతితో పరిచయం ఏర్పడింది.  పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో శ్రీనివాసరావు ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశాడు.  2008  జూన్‌ నెలలో వివాహం చేసుకున్నారు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకొలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా.. వారు ఇరువైపులా పెద్దలకు నచ్చజెప్పి, పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.  క్రమంగా రెండు కుటుంబాల్లో సంబంధాలు మెరుగుపడ్డాయి. దంపతుల అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు కుమారులు జన్మించారు.శ్రీనివాసరావు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆర్‌టీవో కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తుండగా , ప్రశాంతి మాత్రం గృహిణిగా ఉంటోంది. ప్రేమికుల రోజు సందర్భంగా  వారు మాట్లాడుతూ.. ఉన్నత చదువులు అభ్యసించాక, జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని, ప్రేమ పేరుతో తొందరపడి జీవితాలను నష్టపోవద్దని చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement