‘ఈచ్‌ వన్‌–టీచ్‌ వన్‌’లో పోలీసు భాగస్వామ్యం  | DGP Mahender Reddy Comments About Each One Teach One program | Sakshi
Sakshi News home page

‘ఈచ్‌ వన్‌–టీచ్‌ వన్‌’లో పోలీసు భాగస్వామ్యం 

Jan 4 2020 2:12 AM | Updated on Jan 4 2020 2:12 AM

DGP Mahender Reddy Comments About Each One Teach One program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఈచ్‌ వన్‌–టీచ్‌ వన్‌’కార్యక్రమంలో పోలీసు శాఖ ఉత్సాహంగా పాల్గొంటుందని డీజీపీ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈచ్‌ వన్‌–టీచ్‌ వన్‌ కార్యక్రమంలో పోలీసు శాఖ చిత్తశుద్ధితో పాల్గొంటుందని చెప్పారు. ఒక్కొక్క పోలీసు యూనిట్‌ కనీసం తమ పరిధిలోని 20 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

తమ రక్షణ కోసం పోలీసు శాఖ ఉందనే నమ్మకాన్ని పౌరులలో కల్పించాలని చెప్పారు. పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతని స్తోందని తెలిపారు. 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ–రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు ఈ ఏడాది అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీజీపీలు, ఐజీలు, సీనియర్‌ పోలీసు అధికారు లు, డీజీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.  

కానిస్టేబుల్‌ను అభినందించిన డీజీపీ.. 
పోలీసు ఉద్యోగం అంటే సామాజిక సేవ అని నిరూపించిన సిద్దిపేట పోలీస్‌ కానిస్టేబుల్‌ శ్రీశైలంను డీజీపీ అభినందించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సందర్భంగా ఒక గర్భిణికి అత్యవసరంగా ఏ–పాజిటివ్‌ రక్తం అవసరమైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న శ్రీశైలం.. తన రక్తాన్ని దానం చేయడంతో ఆ మహిళకు ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న డీజీపీ.. శ్రీశైలంను అభినందించారు.   

Advertisement
 
Advertisement
Advertisement