కోర్టులకు విశాల భవనాలు | court buildings | Sakshi
Sakshi News home page

కోర్టులకు విశాల భవనాలు

Jul 5 2015 1:16 AM | Updated on Sep 3 2017 4:53 AM

జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయాలకు సరిపడా భవనాలు లేవని, విస్తీర్ణస్థలంలో భవనాల ఏర్పాటుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

పాలమూరు: జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయాలకు సరిపడా భవనాలు లేవని, విస్తీర్ణస్థలంలో భవనాల ఏర్పాటుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్‌రావు పేర్కొన్నారు. శనివారం జ్యుడిషియల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ఆయన ముందుగా జిల్లాలోని మన్యంకొండ దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లాకోర్టు న్యాయమూర్తి రామలింగేశ్వర్‌రావు ముందుగా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోర్టు పరిసరాలను, భవన సముదాయాలను ఆయన పరిశీలించారు.
 
 ఆ తర్వాత బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వివిధ కోర్టులు ఉన్నాయని, వాటిని చిన్నస్థలంలోనే ఒక్కోచోట ఒక కోర్టును నిర్వహించడం వల్ల కక్షిదారులు, న్యాయవాదులకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అన్ని సముదాయాలు విస్తీర్ణస్థలంలో ఒకేచోట ఉండటం వల్ల అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.  తగిన స్థలాన్ని ఎంపిక చేయగలిగితే అన్నికోర్టుల భవన సముదాయాలను ఒకేచోట నిర్మించే విధంగా తాను కృషిచేస్తానన్నారు.
 
  న్యాయవాదులను ఉద్ధేశించి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేయాలని, కక్షిదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు.  ఈ సందర్భంగా జిల్లా జడ్జి శివనాగిరెడ్డి, బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జి రామలింగేశ్వర్‌రావు సన్మానించారు. వివిధ కోర్టులకు చెందిన న్యాయమూర్తులతో నిర్వహించిన జ్యుడిషియల్ కాన్ఫరెన్స్‌లో హైకోర్టు జడ్జి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేసుల సత్వర పరిష్కారం, ఇతర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి శివనాగిరెడ్డి, మొదటి అదనపు జిల్లా జడ్జి హరికృష్ణ భూపతి, జూనియర్ సివిల్ బి.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement