అందరికి ఆదర్శం ఈ సేవ... | couples help to the orphans | Sakshi
Sakshi News home page

అందరికి ఆదర్శం ఈ సేవ...

Apr 1 2017 10:15 PM | Updated on Jul 10 2019 8:00 PM

రోడ్డుపై అనాథగా పడి ఉన్న వారికి కనీస సాయం అందించే ఆశయం ఎంతో ఉన్నతమైనది.

ఆలేరు: రోడ్డుపై అనాథగా పడి ఉన్న వారికి కనీస సాయం అందించే ఆశయం ఎంతో ఉన్నతమైనది. సమాజానికి కొంతైనా సేవా చేయాలన్న సంకల్పం కొందరిలోనే ఉంటుంది. అలాంటి కోవలోకే వస్తారు ఆలేరుకు చెందిన జెల్ల శంకర్‌, దివ్య దంపతులు. వీరి అనాథలను ఆదుకునేందుకు 2016 జూన్‌ 19న అమ్మఒడి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. శంకర్‌ చిన్నపాటి వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి భార్య ఓ ప్రైవేట్‌ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

వీరికి వచ్చే ఆదాయం కొద్ది మాత్రమే అయినా ఎంతో ఉన్నత ఆశయంతో అమ్మ ఒడి అనాథాశ్రమాన్ని నెలకొల్పి ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని, అన్నీ కోల్పోయిన అభాగ్యులను అక్కున చేర్చుకొని వారికి అన్నీ తామై సేవలందిస్తున్నారు. ఇక్కడ ఆశ్రయం పొందిన ఎనిమిది మందిని బాగు చేయించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో 10 మంది ఉన్నారు. తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే అభాగ్యులకు సేవ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు.
 
దాతలు చేయూతనందించాలి - జెల్ల శంకర్, ఆశ్రమ నిర్వాహకుడు
 
అనాథలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు సొంత డబ్బుతోనే నిర్వహణను చూసుకున్నాం. అనాథలకు సేవ చేసి వారిని బాగు చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం సంతృప్తిని ఇస్తుంది. ఇప్పటి వరకు కరీంనగర్, బాలనగర్, జనగామ, పిడుగురాళ్ల, విజయనగరం, జమ్మికుంట, ఏలూరు చెందిన అనాథలను బాగు చేయించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాం. ఎవరైనా దాతలు సహకరిస్తే మరింత మందికి సేవ చేస్తాం. ఆర్థికసాయం అందించే దాతలు 90525 63756 నంబర్‌ను సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement