
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాగర్కర్నూల్ లోక్సభ సీటును స్థానిక అభ్యర్థికే కేటాయిం చాలంటూ ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించబోమంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఈసారి కూడా స్థానికేతరులకు కేటాయిస్తే, ఆ ఎంపీ సీటు పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామంటూ హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్ ఎదుట నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గ కార్యకర్తలు ధర్నా నిర్వహించిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నాన్లోకల్ వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన రాసిన వినతిపత్రాన్ని ఉపాధ్యక్షుడు కుమార్రావుకు సమర్పించారు.
ఈ వినతిపత్రం ప్రతులను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఏఐసీసీ అబ్జర్వర్ కొప్పుల రాజు, టీపీసీసీ ఇన్చార్జి కుంతియాలకు పంపనున్నట్లు తెలిపారు. నాగర్కర్నూల్ స్థానం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా స్థానికేతరులకే కాంగ్రెస్ టికెట్లు కేటాయిస్తూ రావడాన్ని ప్రస్తావిం చారు. ఎంపీలుగా స్థానికేతరులుండటం వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందట్లేదన్నారు. ఈ పరిస్థితుల్లో నాగర్కర్నూల్ ప్రజలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికేతరులకు మద్దతివ్వొద్దని తీర్మానించినట్లు తెలిపారు. పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈసారి స్థానికులకే నాగర్కర్నూల్ టికెట్ వచ్చేలా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మల్లిఖార్జున్, మల్లేశ్ తదితరులున్నారు.