గందరగోళంగా విద్యార్థుల లెక్కలు! 

Confusing student calculations - Sakshi

2016–17లో జెడ్పీ స్కూళ్లలో  20.41 లక్షలు..

2017–18లో 19.06 లక్షలకు  తగ్గిన విద్యార్థులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల లెక్కలపై గందరగోళం నెలకొంది. ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తగ్గిపోతున్నారో.. ఎంత మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో పెరుగుతున్నారో, ప్రభుత్వ గురుకులాల్లో ఎంతమంది చేరుతున్నారో, ఎంతమంది డ్రాపవుట్‌ అవుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ వేస్తున్న ఒక లెక్కతో మరో లెక్కకు పొంతన కుదరడం లేదు. 2016–17 విద్యా సంవత్సరంతో 2017–18 విద్యా ఏడాది లెక్కలను పోల్చి తే 1.34 లక్షల మంది విద్యార్థులు ఒక్క జిల్లా పరిషత్, మండల పరిషత్‌ మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లోనే తగ్గిపోయారు. అదే ప్రైవేటులో 85,565 మంది విద్యార్థులు పెరిగారు. అధికారిక లెక్కల ప్రకారం 2017–18లో ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో మొత్తంగా 5.69% విద్యార్థులు డ్రాపవుట్స్‌ ఉన్నారు. అంటే 1,58,982 మంది విద్యార్థులు బడి మానేసినట్లు విద్యాశాఖ లెక్కలు వేసింది. 2017– 18 విద్యా ఏడాదిలో కొత్తగా ఏర్పాటుచేసిన 470 గురుకులాల్లో 1,50,400 మంది విద్యార్థులు చేరినట్లు సంక్షేమ శాఖలు లెక్కలు వేశాయి.

అయితే బడి మానేసిన వారంతా గురుకులాల్లో చేరారా? అదే నిజమైతే ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన 86,565 మంది విద్యార్థులు ఎలా వచ్చారన్నది అర్థంకాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. 2016–17లో ప్రభుత్వ స్కూళ్ల లో 6,74,748 మంది విద్యార్థులు ఉంటే ఆ సంఖ్య 2017–18 విద్యా ఏడాదిలో 7,58,132కు పెరిగినట్లు లెక్కలు వేసింది. అంటే 83,384 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగినట్లు         తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య, ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య కలిపితే పెరిగిన విద్యార్థుల సంఖ్య 1.70 లక్షలకు చేరుకుంది. అందు లో జెడ్పీ స్కూళ్లలో తగ్గిపోయిన 1.34 లక్షల మందిని తీసేసినా మిగతా 36 వేల మంది విద్యార్థులు ఎక్కడినుంచి వచ్చారన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top