నిమ్స్‌ ట్రయల్స్‌ .. తొలి అడుగు సక్సెస్‌ | Bharat Biotech Covaxin Trial Two Volunteers Discharged | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ ట్రయల్స్‌ .. తొలి అడుగు సక్సెస్‌

Jul 22 2020 6:23 AM | Updated on Jul 22 2020 1:08 PM

Bharat Biotech Covaxin Trial Two Volunteers Discharged - Sakshi

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): కరోనా వ్యాక్సిన్‌ క్లినిక ల్‌ ట్రయల్స్‌ దిశగా నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) తొలి అడుగు విజయవం తమైంది. కరోనా వైరస్‌ నిరోధానికి హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన కొవాక్జిన్‌ను సోమవారం నిమ్స్‌లో ఇద్దరు వలంటీర్లకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో మంగళవారం డిశ్చార్జి చేసినట్టు నిమ్స్‌ వైద్యులు తెలిపారు. 14 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని నిమ్స్‌లోని కొవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.

రోజూ ఫోన్, వీడియో కాల్స్‌ ద్వారా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని, తర్వాత మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తామన్నారు. టీకాలోని అచేతన (అన్‌యాక్టివేటెడ్‌) వైరస్‌ వల్ల శరీరంలో యాంటీబాడీస్‌ ఏ మేరకు వృద్ధి చెందాయి, సమస్యలున్నాయా అనేది పరిశీలిస్తామన్నారు. అంతా సవ్యంగా ఉంటే వారికే రెండో డోస్‌ టీకా ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం టీకా తీసుకున్న వారిలో అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు లేవన్నారు. కొవాక్జిన్‌ టీకా మానవ ప్రయోగంలో తొలి ప్రయత్నం విజయవంతమైందని నిమ్స్‌ క్లినికల్, ఫార్మకాలజీ విభాగం వైద్యులు హర్షం వ్యక్తంచేశారు.

నేడు మరో ఇద్దరికి!
క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా నిమ్స్‌ వైద్యులు 13 మంది వలంటీర్ల రక్త నమూనాలను ఢిల్లీలోని ఐసీఎంఆర్‌ ఆమోదించిన ల్యాబ్‌కు పం పించారు. వీరిలో 8 మందికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ అయినట్టు తెలిసింది. ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే బుధవారం మరో ఇద్దరికి టీకా డోస్‌ ఇవ్వనున్నారు. దీంతో టీకా తీసుకున్న వారి సంఖ్య నాలుగుకి చేరనుంది. వాస్తవానికి మంగళవారం కూడా ట్రయల్స్‌ నిర్వహించా ల్సి ఉన్నా.. వలంటీర్లు ఎవరూ రాని కారణం గా టీకా ఇవ్వలేదని నిమ్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌ చెప్పారు. ఈ ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యవంతమైన 60 మందిపై మొదటి, రెండో దశ ప్రయోగాలను నిర్వహించనున్నారు. మూడో దశలో వంద మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఐదు డోస్‌ల మేరకు టీకా ఇస్తారు. టీకా ప్రయోగాన్ని 2 – 3 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. పరీక్షలు విజయవంతమైతే ఈ ఏడాది చివరికి లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని నిమ్స్‌ వైద్యులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement