భాగ్యనగరంలో బ్యాటరీ బస్సులు

Battery buses in the hyderabad - Sakshi

వంద వాహనాలు మంజూరు చేసిన కేంద్రం 

ఈ సంవత్సరం 40 కొనుగోలు  

తాజాగా టెండర్లు పిలిచిన ఆర్టీసీ 

నాలుగైదు రోజుల్లో ఆపరేటర్ల ఎంపిక    

అద్దె ప్రాతిపదికన ఆపరేటర్లతో నిర్వహణ 

ఒక్కో బస్సుపై రూ. కోటి వరకు సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని రోడ్లపై బ్యాటరీ బస్సులు పరుగుపెట్టబోతున్నాయి. చాలా కాలంగా ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ప్రయ త్నం చేస్తున్నా.. వివిధ సాంకేతిక కారణాలతో ఇప్పటివరకు అది సాధ్యంకాలేదు. తాజాగా కేంద్రం చొరవతో ఎట్టకేలకు ఆ బస్సులు భాగ్య నగర రోడ్లెక్కబోతున్నాయి. మొత్తం వంద బస్సులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమో దం తెలిపింది. ఇందులో మొదట 40 బస్సులు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) గ్లోబల్‌ బిడ్లను ఆహ్వానించింది. ఇందులో స్వదేశీ కంపెనీలతోపాటు విదేశీ కంపెనీలు కూడా పాల్గొన్నాయి.

మరో నాలుగైదు రోజుల్లో వాటిని తెరిచి ఆపరేటర్లను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 50 లక్షల వాహనాలు పరుగుపెడుతున్నాయి. ఫలితంగా కాలుష్యం తీవ్రమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే వాహన కాలు ష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గత సంవత్సరమే అన్ని ప్రధాన ఆర్టీసీలతో అవగాహన సదస్సు కూడా నిర్వహించింది. ఇటీవలే రాష్ట్ర ఆర్టీసీ ప్రయోగాత్మకంగా చైనాకు చెందిన ఓ బస్సును ఎయిర్‌పోర్టు మార్గంలో నడిపి చూసింది. తాజాగా కేంద్రం వంద బస్సులను తెలంగాణ ఆర్టీసీకి మంజూరు చేసింది.  

అద్దె ప్రాతిపదికపై.. 
ఆర్టీసీలో ప్రస్తుతం సాధారణ బస్సులు అద్దె ప్రాతిపదికపై నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్యాటరీ బస్సులు కూడా ఇదే పద్ధతిలో నడవనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకు బ్యాటరీ బస్సులను ఇవ్వనుంది. ఆసక్తి ఉన్న ఆపరేటర్లు వాటిని కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇస్తారు. వాటి నిర్వహణ భారమంతా ఆపరేటర్లే చూసుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్లను కూడా వారే ఏర్పాటు చేసుకోవాలి. కాగా, ఈ బస్సులను కేటాయించిన డిపోల్లో వాటి బ్యాటరీ చార్జింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు స్థలాన్ని ఆర్టీసీ కేటాయించాల్సి ఉంటుంది. ఈ బస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో ప్రతి కిలోమీటర్‌కు నిర్ధారిత మొత్తాన్ని ఆర్టీసీ ఆయా ఆపరేటర్లకు చెల్లిస్తుంది.  

ధర రెండున్నర కోట్లకు పైనే.. 
బ్యాటరీ బస్సు ధర దాదాపు రూ.రెండున్నర కోట్లకు మించి ఉంటుంది. అందులో 60 శాతం లేదా రూ.కోటి.. ఏది ఎక్కువో దాన్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. మిగతా మొత్తాన్ని ఆపరేటర్‌ భరించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం హైదరాబాద్‌కు 40 బస్సులు మంజూరైనందున వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టెండర్ల ద్వారా త్వరలో ఆపరేటర్లను గుర్తించనున్నారు. ఆపరేటర్లకు కనీసం రూ.10 కోట్ల టర్నోవర్‌ ఉండాలని, బస్సు తయారీ సంస్థతో వారికి ఒప్పందం ఉండాలని నిబంధనలు విధించారు.  

ఆసక్తి చూపుతున్న బ్రిటన్‌... 
హైదరాబాద్‌లో బ్యాటరీ బస్సుల నిర్వహణకు బ్రిటన్‌ ఆసక్తి చూపుతోంది. ఆ దేశంలో తయా రైన బస్సులు అమ్మేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మరో పక్క చైనా ఓ అడుగు ముందుకేసి తమ దేశంలో తయారైన బస్సును నెలపాటు ఉచితంగా నడుపుకునేందుకు అందజేసింది. దాన్ని ఎయిర్‌పోర్టు రూట్‌లో నడిపి చూశారు. వందబస్సులు అవసరం ఉన్నందున ఈ డీల్‌ను చేజిక్కించుకోవాలని బ్రిటన్‌ తాపత్రయపడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రివ్‌ ఫ్లెమిం గ్‌ ఆర్టీసీ ఎండీ రమణారావుతో భేటీ అయ్యా రు. బ్రిటన్‌ హైకమిషన్‌లో పనిచేసే ఇద్దరు ప్రతినిధులతో కలసి ఆయన బస్‌భవన్‌ సందర్శించి బ్యాటరీ బస్సుల అంశంపై చర్చించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top