విజిలెన్స్ అధికారుల దాడులు | Sakshi
Sakshi News home page

విజిలెన్స్ అధికారుల దాడులు

Published Wed, Jun 18 2014 11:41 PM

attacks on Vigilance Officers

- విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు, రిమాండు
- దితుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యుడు

మొయినాబాద్: విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరిపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసి రిమాండుకు తరలించారు. నిందితుల్లో ఒకరు ఎంపీటీసీ సభ్యుడు ఉండటం గమనార్హం. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఎనికేపల్లి ఎంపీటీసీ సభ్యుడు డప్పు ఆనంద్ కొన్నేళ్లుగా తన ఇంటికి కరెంట్ మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు.
 గతంలోనూ ఆయనపై విద్యుత్ విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. అదే విధంగా అజీజ్‌నగర్ గ్రామానికి చెందిన తూర్పు కృష్ణారెడ్డి తన వ్యవసాయ పొలం వద్ద పశువుల షెడ్‌కు కరెంట్ మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నాడు.

ఇతనిపైనా గతంలో కేసులు నమోదయ్యాయి. అయినా వీరు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూనే ఉన్నారు. బుధవారం విజిలెన్స్ ఎస్పీ మురళీధర్‌రావు, విజిలెన్స్ ఏఈ బి.బలరాం, మండల విద్యుత్ ఏఈ నాగరాజులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఎనికేపల్లిలో ఎంపీటీసీ సభ్యుడు డప్పు ఆనంద్, అజీజ్‌నగర్‌లో తూర్పు కృష్ణారెడ్డిలు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎస్పీ మురళీధర్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement