గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం
ఏర్పాట్లపై పలు సూచనలు చేసిన ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ కలెక్టర్ రఘునందన్రావు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు.
పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పా ట్లు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఇటు జీహెచ్ఎంసీకి పరేడ్గ్రౌండ్స్లో పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్, గన్పార్క్, క్లాక్టవర్, ఫతేమైదాన్ లాంటి చారిత్రక కట్టడాలను విద్యుద్దీపాలతో అలకరించాలన్నారు. వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్శాఖను ఆదేశించారు. వేడుకకు హాజరయ్యే పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. వేదిక వద్ద అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచిం చారు. అమరుల సైనిక స్మారక్ వద్ద సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం సమర్పించడానికి ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు.