అంగన్‌వాడీలో కొలువులు | Anaganwadi Posts in Hyderabad Online Application Starts | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలో కొలువులు

Feb 22 2019 9:09 AM | Updated on Feb 22 2019 9:10 AM

Anaganwadi Posts in Hyderabad Online Application Starts - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. స్త్రీ శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అంగన్‌వాడీ టీచర్లు, మినీ టీచర్లు,  సహాయకుల కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు, విద్యార్హత, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు http://wdcw.tg.nic.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 22 నుంచి అందుబాటులో ఉంటాయని అధికారులు గురువారం పేర్కొన్నారు.  

పోస్టులు ఇలా...  
నగరంలోని ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 158 పోస్టులు భర్తీ కానున్నాయి. అందులో 42 అంగన్‌వాడీ టీచర్లు. ఒక మినీ టీచర్, 115 సహాయకురాళ్ల పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా పరిశీలిస్తే   చార్మినార్‌ పరిధిలో 30 పోస్టులుండగా... అందులో 5 అంగన్‌వాడీ టీచర్లు, 25 సహాయకురాళ్ల పోస్టులు ఉన్నాయి. గొల్కొండ పరిధిలో 20 పోస్టులకు గాను 5 టీచర్, 15 సహాయకురాళ్లు, ఖైరతాబాద్‌లో 38 పోస్టులకు గాను 13 టీచర్లు, 25 సహాయకురాళ్లు, నాంపల్లిలో 42 పోస్టులకు గాను 13 టీచర్లు, 29 సహాయకురాళ్లు, సికింద్రాబాద్‌ ప్రాజెక్టులో 28 పోస్టులకు గాను 6 అంగన్‌వాడీ టీచర్లు, ఒకటి మినీ టీచర్, 21 సహాయకురాళ్ల పోస్టులు భర్తీ చేయనున్నారు.  

914 కేంద్రాలు..
హైదరాబాద్‌ జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులìæ పరిధిలో 914 కేంద్రాలు ఉండగా, అందులో సుమారు 63,894 చిన్నారులు నమోదై ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్టు పరిధిలో నాలుగైదు మండలాలు ఉన్నాయి. చార్మినార్‌ ప్రాజెక్టు పరిధిలో సైదాబాద్, అంబర్‌పేట, చార్మినార్, బండ్లగూడ మండలాల్లో కలిపి 257 కేంద్రాలు, ఖైరతాబాద్‌ ప్రాజెక్టు పరిధిలోని అంబర్‌పేట, ఖైరతాబాద్, షేక్‌పేట, బాలానగర్‌  మండలాల్లో కలిపి 141 కేంద్రాలు, గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని ఆసీఫ్‌నగర్, గొల్కోండ మండలాల్లో కలిపి  154 కేంద్రాలు, నాంపల్లి ప్రాజెక్టు పరిధిలోని హిమాయత్‌నగర్, బహదూర్‌పురా, నాంపల్లి మండలాల్లో కలిపి  191 కేంద్రాలు, సికింద్రాబాద్‌ ప్రాజెక్టు పరిధిలోని సికింద్రాబాద్, మారేడుపల్లి, తిరుమలగిరి, ముషీరాబాద్‌ మండలాల్లో కలిపి 171 కేంద్రాలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement