ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు | Akun Sabarwal on kharif grain purchase | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

Sep 30 2018 3:01 AM | Updated on Sep 30 2018 3:02 AM

Akun Sabarwal on kharif grain purchase - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌లో భారీగా ధాన్యం దిగుబడి అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ అన్నారు. ఖరీఫ్‌ కార్యాచరణపై పౌరసరఫరాల జాయింట్‌ కలెక్టర్లు, జిల్లా అధికారులు, సంస్థ మేనేజర్లతో అకున్‌ సబర్వాల్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కనీస మద్దతు ధరపై రైతుల్లో అవ గాహన కల్పించేలా రూపొందించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అక్టోబర్‌ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్థానిక అవసరాలను బట్టి 5 కిలోమీటర్లకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయా లని అధికారులను ఆదేశించారు.

ఆయా కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు వేచి చూడాల్సిన పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పీపీసీల్లో తేమ కొలిచే యం త్రాలు, ప్యాడీ క్లీనర్స్, విన్నోవింగ్‌ మిషన్లతోపాటు తాగునీరు, టాయిలెట్స్‌ వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లాస్థాయిలో ధాన్య సేకరణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. ఈ కమిటీలో డీసీఎస్‌వోలు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు, మార్కెటింగ్, ఆర్‌టీఏ అధికారులు, వ్యవసాయ శాఖల జిల్లా  అధికారులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ,  కనీసమద్దతు ధర వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరను తప్పనిసరిగా చెల్లించాలని, కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని ఆదేశించారు.  

ధాన్యం కొనుగోళ్లపై టోల్‌ ఫ్రీ నంబర్‌.. 
ధాన్యం ఎంత కొనుగోలు చేశాం, ఎంత తిరస్కరించింది, చెల్లింపులు వంటి వాటిని ఆన్‌లైన్‌లో ఏ రోజుకారోజు పొందుపర్చాలని అధికారులను అకున్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఐకేపీ, పీఏసీ, పౌరసరఫరాలు, ఎఫ్‌సీఐ సాంకేతిక సిబ్బందికి కేంద్రాల ఏర్పాటుకు ముందే శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్‌లో పౌరసరఫరాల భవన్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333 ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా స్థాయిలో కూడా టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
 
ప్రభుత్వ గోదాములకే తొలి ప్రాధాన్యత
మిల్లర్ల నుంచి సేకరించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను స్టోరేజ్‌ చేయడానికి ప్రభుత్వ గోదాములకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అకున్‌ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో జిల్లాల వారీగా గన్నీ సంచులను కేటాయించామని, 34 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్య సేకరణకు 8.59 కోట్ల గోనె సంచులు అవసరం అవుతాయని అంచనా వేశామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement